మధ్యప్రదేశ్.. కరోనా..,ఫ్లోర్ టెస్ట్ డ్రామా.. సుప్రీంకోర్టుకెక్కిన బీజేపీ
మధ్యప్రదేశ్ లో కమల్ నాథ్ ప్రభుత్వానికి 10 రోజుల ఊరట లభించింది. కరోనా 'పుణ్యమా' అని అసెంబ్లీని ఈ నెల 26 వరకు వాయిదా వేయడంతో సభలో కమల్ నాథ్ ప్రభుత్వ బలపరీక్ష మిస్సయింది.
మధ్యప్రదేశ్ లో కమల్ నాథ్ ప్రభుత్వానికి 10 రోజుల ఊరట లభించింది. కరోనా ‘పుణ్యమా’ అని అసెంబ్లీని ఈ నెల 26 వరకు వాయిదా వేయడంతో సభలో కమల్ నాథ్ ప్రభుత్వ బలపరీక్ష మిస్సయింది. గవర్నర్ లాల్ జీ టాండన్ కేవలం నిముషం మాత్రమే ప్రసంగించి నిష్క్రమించారు. ‘సభను గౌరవించండి’ అని సభ్యులు నినాదాలు చేస్తుండగా.. ఆయన సభ నుంచి వాకౌట్ చేశారు. రాజ్యాంగం ప్రకారం సభ హుందాతనాన్ని కాపాడాలని, సభ్యులు నిబంధనలను పాటించాలని గవర్నర్ కోరుతున్నప్పడు కూడా కాంగ్రెస్, బీజేపీ సభ్యులు స్లోగన్స్ ఆపలేదు. దీంతో ఆయన సభ నుంచి బయటకి వెళ్లిపోయారు. ఆయన వెళ్ళాక కూడా రెండు పార్టీల సభ్యులూ ఒకరిపై ఒకరు వ్యతిరేక నినాదాలు చేసుకున్నారు.
అటు-సభను వాయిదా వేయడాన్ని సవాలు చేస్తూ బీజేపీ నేతలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బలపరీక్షను నిర్వహించేలా స్పీకర్ ను ఆదేశించాలని వారు కోరారు. అధికారంలో కొనసాగే హక్కు కమల్ నాథ్ ప్రభుత్వానికి లేదని, ఆయన ‘నేతృత్వంలో ‘బేరసారాలు జరిగే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ చేపట్టవచ్ఛు. కాగా-కరోనాను సాకుగా చూపి. కమల్ నాథ్ తన ప్రభుత్వాన్ని కాపాడుకొవడానికి ప్రయత్నిస్తున్నారని బీజేపీ నేత, మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఆరోపించారు. చౌహాన్ ఆధ్వర్యాన బీజేపీ ఎమ్మెల్యేలు గవర్నర్ ముందు పరేడ్ నిర్వహించారు.