
జార్ఖండ్ రాజధాని రాంచీలో మహిళల భద్రతపై తీవ్ర ఆందోళన కలిగించే ఘటన వెలుగులోకి వచ్చింది. మందార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్గే గ్రామంలో ఓ యువతిని ఇంటి నుంచి అపహరించి సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు వేగంగా స్పందించి ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేశారు. మరో మైనర్ను అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం, బాధితురాలు గత రెండేళ్లుగా తన గ్రామానికి చెందిన ఓ యువకుడితో సహజీవనం చేస్తోంది. అయితే సుమారు నెలన్నర క్రితం అతను ఉపాధి కోసం కేరళకు వెళ్లడంతో ఆమె ఒంటరిగా నివసిస్తోంది. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకున్న కొందరు యువకులు శుక్రవారం (జూన్ 05) అర్ధరాత్రి సమయంలో ఆమె ఇంటికి చేరుకుని బలవంతంగా అపహరించారు.
అనంతరం కర్గే నది ఒడ్డున ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి, ఒకరి తర్వాత ఒకరు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారని బాధితురాలు పోలీసులకు తెలిపింది. దారుణానికి పాల్పడిన అనంతరం నిందితులు శనివారం ఉదయం ఆమెను నది ఒడ్డునే వదిలేసి పరారయ్యారు. తీవ్ర మానసిక వేదనలో ఉన్న బాధితురాలు ఎలాగోలా మందార్ పోలీస్ స్టేషన్కు చేరుకుని ఫిర్యాదు చేసింది.
ఘటన తీవ్రతను దృష్టిలో ఉంచుకుని రాంచీ ఎస్ఎస్పి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఖలారీ డీఎస్పీ నేతృత్వంలో మందార్, చాన్హో, బుధ్ము, ఠాకూర్గావ్ పోలీస్ స్టేషన్ల సిబ్బంది సంయుక్తంగా దాడులు నిర్వహించారు. బాధితురాలు ఇచ్చిన సమాచారం, సాంకేతిక ఆధారాల సహాయంతో కేవలం ఎనిమిది గంటల్లోనే ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేశారు.
అరెస్టైన వారిలో ఆయుష్ ఓరాన్, పాపడ్ ముండా అలియాస్ ప్రకాష్ ముండా, రామ్లుస్ కుజుర్, రంజిత్ ఓరాన్, ఉమేష్ భగత్, దీపక్ ఓరాన్, రామ్ ఓరాన్, వికాస్ ఓరాన్ ఉన్నారని పోలీసులు వెల్లడించారు. కేసుపై మరింత లోతుగా దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆగ్రహం రేకెత్తించగా, నిందితులకు కఠిన శిక్ష విధించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..