
ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 అరుదైన ఘనత సాధించింది. చంద్రయాన్-3కి ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. ఈ ప్రాజెక్టుకు అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటిక్స్ అండ్ ఆస్ట్రోనాటిక్స్ 2026 గాడార్డ్ ఆస్ట్రోనాటిక్స్ అవార్డు అందించింది. AIAA ASCEND 2026 సదస్సులో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ అయిన ఇస్రో తరపున అమెరికాలోని భారత రాయబారి వినయ్ క్వాత్రా ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా రాయబారి క్వాత్రా మాట్లాడుతూ.. ప్రధాని మోదీ స్పేస్ విజన్ 2047ను వివరించారు. లోతైన అంతరిక్ష అన్వేషణ, మానవ అంతరిక్ష యానం, వాణిజ్య అంతరిక్ష రంగం వేగవంతమైన వృద్ధి కోసం భారతదేశం కార్యాచరణ ప్రణాళికను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు.
అంతరిక్ష పరిశోధనలో ఇరు దేశాల మధ్య బలపడుతున్న భాగస్వామ్యాన్ని నొక్కిచెబుతూ.. భారతదేశం, యునైటెడ్ స్టేట్స్ ప్రభుత్వాలు, పరిశ్రమలు, పరిశోధనా సంస్థల మధ్య సహకారాన్ని బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. 2023 ఆగస్టు 23న చంద్రయాన్-3 చంద్రుని దక్షిణ ధ్రువం సమీపంలో సాఫ్ట్ ల్యాండింగ్ సాధించిన మొదటి అంతరిక్ష నౌకగా చరిత్ర సృష్టించింది. అపారమైన శాస్త్రీయ, వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగిన ఈ ప్రాంతాన్ని ఇంతకు ముందెన్నడూ ఉపరితల స్థాయిలో అన్వేషించలేదు.