AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

2 డాలర్లే! శ్రామికుల తలలకు కెమెరాలు.. రోబోలకు పని నేర్పించి.. చివరికి ఉద్యోగాలనే కోల్పోతారా?

Indian Workers Training Robots Telugu: రోబోలకు శిక్షణ ఇచ్చేందుకు భారతీయ కార్మికులు నుదుటికి ఐఫోన్లు కట్టుకుని తమ పనిని వీడియోగా రికార్డ్ చేస్తున్నారు. గంటకు సుమారు $2.62 చెల్లిస్తున్న ఈ పనిపై కార్మికుల సమ్మతి, ఉద్యోగాల భవిష్యత్తుపై కీలక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

2 డాలర్లే! శ్రామికుల తలలకు కెమెరాలు.. రోబోలకు పని నేర్పించి.. చివరికి ఉద్యోగాలనే కోల్పోతారా?
Indian Workers Training Robots
Rajashekher G
|

Updated on: Aug 15, 2026 | 8:34 AM

Share

Indian Workers Training Robots Telugu: ఇటీవల కాలంలో మనుషులు చేసే దాదాపు అన్ని పనులను రోబోలు చేసేస్తున్నాయి. ఈ క్రమంలోనే వాటికి చాలా పనులపై సరైన అవగాహన కల్పించడం అవసరమైంది. ఈ నేపథ్యంలోనే మనుషులు చేసే పనుల గురించి వాటికి అవగాహన కల్పించే కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగానే నుదుటికి ఐఫోన్‌/కెమెరాను కట్టుకుని, తమ చేతులు చేసే ప్రతి కదలికను కెమెరాలో రికార్డ్ చేస్తూ పనిచేస్తున్నారు మహిళలు. ఇదే, భవిష్యత్తులో మనుషులు చేసే పనులను రోబోలు చేయడానికి అవసరమైన శిక్షణ డేటాను సిద్ధం చేసే ప్రక్రియ. భారతదేశంలోని వేలాది మంది కార్మికులు తమ రోజువారీ శ్రమను ఫస్ట్‌-పర్సన్‌ వీడియోలుగా చిత్రీకరిస్తూ డబ్బు సంపాదిస్తున్నట్లు బ్లూమ్‌బెర్గ్‌ పరిశోధన వెల్లడించింది.

అసలు ఏం జరుగుతోంది?

బ్లూమ్‌బెర్గ్‌ నివేదిక ప్రకారం.. భారత్‌లోని పలువురు కార్మికులు తమ పని చేసే సమయంలో సాధారణ ఐఫోన్లు లేదా ఇతర కెమెరాలను తలకు కట్టుకుని వీడియోలు రికార్డ్ చేస్తున్నారు. కెమెరా కిందికి ఉండేలా అమర్చి, చేతులు చేసే ప్రతి కదలిక స్పష్టంగా కనిపించేలా చిత్రీకరిస్తున్నారు. ప్లాస్టిక్‌ సంచులపై ఉన్న లేబుళ్లను బ్లేడ్‌తో తొలగించడం, రీసైక్లింగ్‌ కోసం సంచులను ఒకదానిపై ఒకటి పేర్చడం, చెప్పులు కుట్టడం, స్టీల్‌ను వెల్డింగ్‌ చేయడం వంటి అనేక పనులను ఈ విధంగా రికార్డ్ చేస్తున్నారు. ఈ వీడియోలను రోబోటిక్స్‌ సంస్థలు తమ యంత్రాలకు శిక్షణ ఇవ్వడానికి ఉపయోగిస్తున్నాయి. ఈ పని కోసం కార్మికులకు గంటకు సుమారు 2.62 డాలర్లు చెల్లిస్తున్నట్లు నివేదిక పేర్కొంది.

ఈ వీడియోలు రోబోట్లకు ఎందుకు అవసరం?

ఈ రకమైన వీడియో డేటాను సాంకేతికంగా ‘ఎగోసెంట్రిక్‌ డేటా’ (Egocentric Data) అంటారు. అంటే.. ఒక వ్యక్తి పని చేస్తున్నప్పుడు అతని కళ్ల స్థానం నుంచి లేదా అతని దృష్టికోణం నుంచి రికార్డ్ చేసిన వీడియో. రోబోట్‌ ఒక పనిని చేయడం నేర్చుకోవాలంటే కేవలం చేతులు, కాళ్ల కదలికలను అనుకరించడం సరిపోదు. ఎంత ఒత్తిడి పెట్టాలి? ఏ కోణంలో వస్తువును పట్టుకోవాలి? ఏ క్రమంలో పని చేయాలి? వస్తువు ఊహించిన విధంగా స్పందించకపోతే వెంటనే ఎలా మార్పు చేయాలి? వంటి ఎన్నో విషయాలను రోబోట్‌ నేర్చుకోవాల్సి ఉంటుంది.

ఈ నైపుణ్యాల్లో చాలా వరకు కార్మికులకు అనుభవం ద్వారా వస్తాయి. వాటిని పూర్తిగా మాటల్లో వివరించడం కూడా కష్టం. అయితే, వారు చేసే పనిని ఫస్ట్‌-పర్సన్‌ వీడియోగా రికార్డ్ చేస్తే.. ఆ అనుభవం మొత్తం డేటాగా మారుతుంది. పెద్ద మొత్తంలో ఇలాంటి వీడియోలను ఏఐ మోడళ్లకు అందించడం ద్వారా రోబోలు మానవుల కదలికలను అనుకరించేలా శిక్షణ ఇవ్వవచ్చు.

అసలు సమస్య ఇక్కడే..

అయితే ఈ వ్యవహారంలో ప్రధానంగా కార్మికుల సమ్మతి, వారికి ఇచ్చే సమాచారంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బ్లూమ్‌బెర్గ్‌ నివేదిక ప్రకారం.. తాము చిత్రీకరిస్తున్న వీడియోలను తమ ఉద్యోగ రంగాన్నే ఆటోమేట్‌ చేయడానికి రోబోటిక్స్‌ సంస్థలు ఉపయోగించబోతున్నాయని పలువురు కార్మికులకు స్పష్టంగా తెలియజేయలేదని ఆరోపణలు ఉన్నాయి. ఈ తరహా ఏర్పాట్లలో కార్మికుల నుంచి తీసుకున్న సమ్మతి సరిపోతుందా? అనే అంశంపై భారత ఐటీ మంత్రిత్వ శాఖ కూడా ప్రశ్నలు లేవనెత్తినట్లు నివేదిక పేర్కొంది.

డేటా లేబులింగ్‌కు ఇది భిన్నం

భారత్‌ చాలాకాలంగా ఏఐ రంగానికి డేటా లేబులింగ్‌, కంటెంట్‌ మోడరేషన్‌, ఐటీ సేవల ద్వారా మానవ వనరులను అందిస్తోంది. అయితే ఈ సందర్భం కొంత భిన్నమైనది. డేటా లేబులింగ్‌లో సాధారణంగా కార్మికులు ఇతరుల డేటాను పరిశీలించి, వాటికి ట్యాగ్‌లు లేదా లేబుళ్లు జోడిస్తారు. కానీ ఇక్కడ కార్మికులే డేటాగా మారుతున్నారు. వారి చేతుల కదలికలు, శరీర కదలికలు, పనిచేసే ప్రదేశం, పని చేసే విధానం.. ఇవన్నీ రోబోలకు శిక్షణ ఇచ్చే ముడి డేటాగా మారుతున్నాయి. అంతేకాదు, ఆ డేటా చివరకు వారు చేస్తున్న పనిని యంత్రాలతో చేయించడానికి ఉపయోగపడే అవకాశం ఉండటమే ఈ వ్యవహారంపై నైతిక ప్రశ్నలను పెంచుతోంది.

ఏఐతో భారత ఉద్యోగ రంగానికి మరో సవాలు?

భారత్‌ ప్రపంచ ఏఐ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషించడానికి ప్రధాన కారణాల్లో ఒకటి మానవ శ్రమ. డేటా ప్రాసెసింగ్‌, కంటెంట్‌ మోడరేషన్‌, సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధి వంటి రంగాల్లో భారతీయ ఉద్యోగులు ప్రపంచ టెక్నాలజీ పరిశ్రమకు సేవలు అందిస్తున్నారు. అయితే జనరేటివ్‌ ఏఐ కారణంగా ఈ రంగాల్లోనూ ఆటోమేషన్‌ పెరుగుతోంది. 2024 ఆగస్టు నుంచి టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, విప్రో, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, టెక్‌ మహీంద్రా సంస్థల కలిపిన మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ 46 శాతానికి పైగా తగ్గిందని నివేదిక పేర్కొంది. 2026లో ప్రపంచవ్యాప్తంగా ప్రకటించిన దాదాపు 50,000 ఉద్యోగ కోతలకు ఏఐని ప్రత్యక్ష కారణంగా పేర్కొన్నట్లు కూడా తెలిపింది. ఇప్పుడు ఇదే ధోరణి భౌతిక శ్రమ రంగానికీ చేరుతున్నట్లు ఈ పరిణామం సూచిస్తోంది.

నుదుటిపై ఉన్న కెమెరా.. మారుతున్న భవిష్యత్తుకు సంకేతమా?

రోబోలకు శిక్షణ ఇవ్వడానికి డేటా అవసరం. అందుకోసం కార్మికులకు డబ్బు చెల్లించి వారి పనిని రికార్డ్ చేయించడం అనేది స్వతహాగా చట్టవిరుద్ధం లేదా తప్పు అని చెప్పలేం. అయితే గంటకు కేవలం 2.62 డాలర్ల చెల్లింపు, అలాగే ఆ వీడియోల అసలు ఉద్దేశ్యం కార్మికులకు ఎంతవరకు స్పష్టంగా వివరించారనే ప్రశ్నలు మాత్రం కీలకంగా మారుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ కార్మికులు కేవలం డేటాను సేకరించే వ్యక్తులు కాదు.. వారి శ్రమ, వారి కదలికలే రోబోట్లకు శిక్షణ ఇచ్చే డేటాగా మారుతున్నాయి.

నేడు నుదుటిపై ఐఫోన్‌ పెట్టుకుని ఒక మహిళ ప్లాస్టిక్‌ను వేరు చేస్తూ కనిపించవచ్చు. కానీ ఆమె చేతుల కదలికలను రికార్డ్ చేస్తున్న ఆ కెమెరా.. రేపటి రోజున అదే పనిని మనిషి స్థానంలో చేయబోయే యంత్రానికి శిక్షణ ఇస్తుండవచ్చు. ఇదే ఏఐ, రోబోటిక్స్‌ విస్తరణతో ఎదురవుతున్న కొత్త ఆర్థిక, నైతిక ప్రశ్నలకు ప్రతీకగా మారుతోంది.

Follow Us