Cyrus Mistry Death: టాటా సన్స్ మాజీ ఛైర్మన్ మిస్త్రీ మృతి కేసులో కీలక పరిణామం.. రెండు నెలల తర్వాత ఆమె పై కేసు..

|

Nov 05, 2022 | 10:07 PM

టాటా సన్స్ మాజీ ఛైర్మన్, ప్రముఖ వ్యాపారవేత్త సైరస్ మిస్త్రీ మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మొదటి నుంచి ఈ కేసు అనేక మలుపులు తిరుగుతూ వస్తోంది. ఈ కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. ప్రమాద సమయంలో ముంబైకి చెందిన ప్రముఖ గైనకాలజిస్ట్..

Cyrus Mistry Death: టాటా సన్స్ మాజీ ఛైర్మన్ మిస్త్రీ మృతి కేసులో కీలక పరిణామం.. రెండు నెలల తర్వాత ఆమె పై కేసు..
Cyrus Mistry Accident
Follow us on

టాటా సన్స్ మాజీ ఛైర్మన్, ప్రముఖ వ్యాపారవేత్త సైరస్ మిస్త్రీ మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మొదటి నుంచి ఈ కేసు అనేక మలుపులు తిరుగుతూ వస్తోంది. ఈ కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. ప్రమాద సమయంలో ముంబైకి చెందిన ప్రముఖ గైనకాలజిస్ట్, డాక్టర్ అనహిత పండోల్ అనే మహిళ కారును డ్రైవ్ చేశారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తమ విచారణలో నిర్ధారించారు. దీంతో కారు ప్రమాదం జరిగిన రెండు నెలల తర్వాత నవంబర్ ఐదో తేదీన పండోల్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. మోటారు వాహనాల చట్టంతో పాటు భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 2022 సెప్టెంబర్ 4న సైరస్ మిస్త్రీ, ఆయన స్నేహితుడు మెర్సిడిస్ కారులో ప్రయాణిస్తున్నారు. ముంబై – అహ్మదాబాద్ హైవేపై ఉన్న సూర్య నది వంతెనపై కారు ప్రమాదానికి గురై మిస్త్రీ మరణించారు. కారు నడుపుతున్న అనహిత పండోలే.. ఆమె భర్త డారియస్ లు తీవ్రంగా గాయపడ్డారు. వీరు గత వారం ముంబైలోని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. విచారణలో పలువురి నుంచి సాక్ష్యాలు సేకరించినట్లు, ప్రాంతీయ రవాణా కార్యాలయంతో పాటు మెర్సిడెస్ ఇండియా నుంచి నివేదికలు పొందామని పోలీసులు వెల్లడించారు.

పండోల్ భర్త డేరియస్ వాంగ్మూలాన్ని ఇటీవల పోలీసులు నమోదు చేసుకున్నారు. ఒక లేన్ నుంచి మరో లేన్‌కు మారే క్రమంలో కారు అదుపుతప్పి ప్రమాదానికి గురైనట్లు డేరియస్ చెప్పినట్లు తెలుస్తోంది. రిపోర్టులు, దర్యాప్తు ఆధారంగా నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు నిర్ధారించారు. డాక్టర్ అనహిత పండోల్‌పై కేసు నమోదు చేశామని వెల్లడించారు. సైరస్‌ మిస్త్రీ కారు ప్రమాదానికి కారణాలపై ముంబై పోలీసులు దర్యాప్తు చేపట్టి పలు కోణాల్లో లోతుగా విచారణ చేసిన విషయం తెలిసిందే.

ఈ ప్రమాదానికి రోడ్డు లోపం, అతివేగమే కారణమంటూ హాంకాంగ్‌ మెర్సిడెజ్‌ బెంజ్ టీమ్‌ గతంలో నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం అప్పట్లో దేశ కార్పొరేట్ సమాజాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఆయన ప్రయాణించిన కారు యాజమాన్యం మెర్సిడెస్ బెంజ్ అధికారులు సైతం స్పాట్‌కి వచ్చి విచారణ చేపట్టారు. మెర్సిడెస్ బెంజ్ తన ప్రాథమిక రిపోర్టును పోలీసులకు సమర్పించింది. ఈ నివేదిక ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..