షిరిడీ ఆలయ నిధులకు పటిష్ట భద్రత.. ఎలా కాపాడుతున్నారో తెలుసా?

అయోధ్య రామాలయంలో భక్తుల కానుకలు, విరాళాల చోరీ దేశ వ్యాప్తంగా పెను దుమారం రేపుతోంది. దేశంలోని ఇతర ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో భక్తులు సమర్పించే కానుకలకు ఏ మేరకు భద్రత ఉందన్నది చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని షిరిడి సాయిబాబా, సిద్ధి వినాయక ఆలయాల్లో భక్తులు సమర్పించే కానుకలకు మెరుగైన భద్రత, పారదర్శక లెక్కల విధానాలు అమలు అవుతోంది. అక్కడ భక్తుల కానుకలు ఎలా భద్రపరుస్తారో తెలుసుకోండి.

షిరిడీ ఆలయ నిధులకు పటిష్ట భద్రత.. ఎలా కాపాడుతున్నారో తెలుసా?
Shirdi Sai Baba Temple

Edited By:

Updated on: Jul 09, 2026 | 12:58 PM

అయోధ్య రామాలయ కానుకల చోరీ దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో దేశంలోని ఇతర ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో భక్తులు సమర్పించే కానుకలు భద్రమేనా? అనే చర్చ జరుగుతోంది. ఆ ప్రముఖ పుణ్యక్షేత్రాలకు భక్తులు సమర్పించే విరాళాలు, కానుకలను ఎలా భద్రపరుస్తున్నారన్న అంశం ఆసక్తికరంగా మారింది. అయోధ్య రామాలయంలో భక్తులు సమర్పించే కానుకలు, విరాళాల భద్రతకు తిరుమల ఆలయం (టీటీడీ) తరహా పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది.  ఇందులో భాగంగానే మహారాష్ట్రలోని షిరిడీ సాయిబాబా ఆలయంతో పాటు ముంబై సిద్ధివినాయక ఆలయాలు విరాళాల సేకరణలో అనుసరిస్తున్న పారదర్శక విధానాలపై ఇప్పుడు చర్చ జరుగుతోంది.

భారతదేశంలోని అత్యంత సంపన్న దేవాలయాల్లో షిరిడీ సాయిబాబా ఆలయం ఒకటి. ఈ ఆలయం ఏడాదికి విరాళాలు, బ్యాంక్ వడ్డీల రూపంలో రూ. 850 కోట్ల ఆదాయాన్ని పొందుతోంది. ఇంత భారీ మొత్తాన్ని ట్రస్ట్ ఏ విధంగా నిర్వహిస్తోందంటే..

షిరిడీ ఆలయంలో పటిష్టమైన వ్యవస్థ

భక్తులు హుండీలో వేసే నగదును వారానికి రెండుసార్లు లెక్కిస్తారు. ఈ మొత్తం ప్రక్రియ CCTV నిఘాలో, ట్రస్ట్ అధికారులు, ఛారిటీ కమిషనర్, బ్యాంక్ ప్రతినిధుల సమక్షంలో జరుగుతుంది. నగదు లెక్కించే సిబ్బందికి జేబులు లేని ప్రత్యేక దుస్తులను కేటాయిస్తారు. వారు కౌంటింగ్ సెంటర్‌లోకి వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. భక్తులు సమర్పించిన బంగారం, వెండి వస్తువులను అధికారిక వాల్యూయర్ ద్వారా అంచనా వేయించి వాటిని నాణేలుగా మారుస్తారు. ట్రస్ట్‌లో భాగంగా ఉన్న ఆడిటర్లతోనే కాకుండా బయటి ఆడిటర్లతో కూడా ఖాతాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేయిస్తారు. వార్షిక నివేదికను ప్రతి సంవత్సరం మహారాష్ట్ర శాసనసభ ముందు ఉంచుతారు.

సిద్ధివినాయక ఆలయంలో ఇలా..

ముంబైలోని ప్రసిద్ధ సిద్ధివినాయక ఆలయం ఏడాదికి రూ. 200 కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తుంది. ఇక్కడ కూడా నగదును వారానికి ఒకసారి CCTV నిఘాలో లెక్కిస్తారు. అలాగే భక్తుల నుంచి వచ్చిన బంగారం, వెండి వస్తువులను ఏటా 4 నుండి 5 సార్లు వేలం వేస్తారు.

వివాదాలు – న్యాయపరమైన జోక్యం

ఎంతటి పటిష్టమైన వ్యవస్థ ఉన్నప్పటికీ, గతంలో కొన్ని సందర్భాల్లో ఈ ఆలయాలు వివాదాల్లో చిక్కుకున్నాయి. నిధుల దుర్వినియోగం ఆరోపణలతో షిరిడీ ట్రస్ట్‌ను రద్దు చేయాలని గతంలో కొందరు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. 2024లో సుప్రీంకోర్టు, ట్రస్ట్ సభ్యుల ఎంపికలో మహారాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన విధానం లోపభూయిష్టంగా ఉందని పేర్కొంటూ కీలక వ్యాఖ్యలు చేసింది.

ఏటా లక్షలాది మంది భక్తులు సందర్శించే ఈ క్షేత్రాలు, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి సీసీటీవీ తదితర సాంకేతికతను, బ్యాంకింగ్ పర్యవేక్షణను, కఠినమైన ఆడిటింగ్ విధానాలను అనుసరిస్తున్నాయి. విరాళాల రూపంలో వచ్చిన ఈ నిధులను విద్య, వైద్యం, పేదలకు ఉచిత భోజనం వంటి సేవా కార్యక్రమాల కోసం ఈ ట్రస్టులు వినియోగిస్తున్నాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us