Presidential Election 2022: బీజేపీకి వ్యతిరేకంగా రాష్ట్రపతి అభ్యర్థిని బరిలో నిలిపే పనిలో.. అభ్యర్థి ఆయనేనా..

ప్రస్తుత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పదవి కాలం జూలై నెలతో ముగియనుంది. అంటే జూలై 25న కొత్త రాష్ట్రపతి కొలువుదీరాల్సి ఉంది. దీంతో కేంద్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. 

Presidential Election 2022: బీజేపీకి వ్యతిరేకంగా రాష్ట్రపతి అభ్యర్థిని బరిలో నిలిపే పనిలో.. అభ్యర్థి ఆయనేనా..
Presidential Election 2022

Updated on: May 25, 2022 | 1:24 PM

భారత రాష్ట్రపతి ఎన్నికకు(Presidential Election) సమయం దగ్గరపడుతోంది. కేవలం మరో రెండు నెలలు మాత్రమే మిగిలివుంది. ప్రస్తుత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్(Ramnath Kovind) పదవి కాలం జూలై నెలతో ముగియనుంది. అంటే జూలై 25న కొత్త రాష్ట్రపతి కొలువుదీరాల్సి ఉంది. దీంతో కేంద్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అధికార పక్షం ఎన్డీఏకు చెక్ పెట్టాలనే ఆలోచనతో ఇప్పటికే హస్తినలో పావులు కదుపుతున్నారు వైరి పక్షాలు. ముఖ్యంగా బీజేపీకి వ్యతిరేకంగా అభ్యర్థిని బరిలో దింపేందుకు ఇప్పటికే విపక్ష పార్టీలు వేగంగా పావులు కదుపుతున్నాయి. గత నెలలో జరిగిన టీఆర్ఎస్ ప్లీనరీ తర్వాత జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ తో ఇదే విషయంపై సీఎం కేసీఆర్ సుదీర్ఘంగా చర్చించినట్లుగా సామాచారం. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీయేతర పార్టీల తరఫున బలమైన అభ్యర్థిని నిలిపి, సత్తా చాటాలని ప్లాన్ చేసినట్లగా తెలుస్తోంది. ఇందుకోసం బీజేపీయేతర సీఎంల భేటీ ఏర్పాటు చేసి.. రాష్ట్రపతి అభ్యర్థిని ఎన్నుకోవాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.. ఇందులో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఇప్పటికే బీజేపీయేతర పార్టీల పాలనలోని ప్రభుత్వాలను కలిపే పనిలో పడ్డారు.

ఇదిలావుంటే, విపక్షాల తరఫున రాష్ట్రపతి అభ్యర్థి కోసం ఇప్పటికే పలువురి పేర్లు చర్చలోకి వచ్చాయి. ఇందులో ముఖ్యంగా బీజేపీయేతర పార్టీలన్నీ కలిసి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ ని బరిలో నిలపాలని ప్రశాంత్ కిషోర్(PK) ప్లాన్ అప్పట్లో జరిగినట్లుగా మీడియా కథనాలు గుప్పుమన్నాయి. ఆ తర్వాత మీడియాలోకి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పేరు కూడా బాగానే వినిపించింది. రాష్ట్రపతి పదవి కోసం ఆయన స్వయంగా వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారనే ప్రచారం జోరుగా సాగింది. విపక్ష పార్టీలు కూడా శరద్ పవార్ అయితే బాగుంటందని చేతులు కలిపాయి. అయితే ఇది విపక్షాల ప్లాన్ కాదు.. బీజేపీ ఎత్తుగడ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. ఇంతలోనే బీజేపీ తరఫున గులాం నబీ ఆజాద్ పేరు స్క్రీన్‌పైకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానంపై తిరుగుబాటుచేసిన 23 మంది సీనియర్ల బ్యాచ్‌లో ఆజాద్ కూడా ఒకరు. దీంతో కాంగ్రెస్‌కు చెక్ పెట్టాలంటే ఆయనే బెటరని బీజేపీ భావిస్తున్నట్టు కూడా ప్రచారం జరిగింది. అయితే ఆయనకు పద్మభూషణ్‌ పురస్కారాన్ని ప్రకటించింది కేంద్రం. దీంతో అంతా తూచ్ అనుకుని మరో ఎత్తుగడను మొదలు పెట్టారు.

ఆ తర్వాత యూపీ మాజీ సీఎం బీఎస్పీ చీఫ్ మాయావతి పేరు కూడా వినిపించింది. ఆమె పేరును సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు, మాజీ యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ తెరపైకి తేవడంతో కొద్ది రోజు ఈ వార్త కూడా నడిచింది. ఇటీవల యూపీ ఎన్నికల సందర్భంగా బీఎస్పీ ఓట్లు బీజేపీకి పడేలా చేశారని.. ప్రతిఫలంగా బీజేపీ ఆమెను రాష్ట్రపతి అభ్యర్థి చేస్తుందేమో చూడాలని ఓ విచిత్రమైన కామెంట్ చేశారు అఖిలేష్. అయితే, దీనిపై మాయావతి వెంటనే తిప్పికొట్టారు. ముఖ్యమంత్రి లేదా ప్రధాని కావాలనుకుంటున్న తాను.. రాష్ట్రపతి పదవిని ఎలా ఆశిస్తానని స్ట్రాంగ్‌ కౌంటర్ ఇచ్చారు. ఇలాంటి ప్రచారాన్ని పక్కనపెడేతే ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి వివిధ రాష్ట్రాల్లో పర్యటించడం అక్కడి ముఖ్య నేతలతో చర్చలు జరుపుతుండటంతో మరోసారి రాష్ట్రపతి అభ్యర్థిపై డిస్కషన్ మొదలైంది. జూలై నెల దగ్గర పడుతున్న కొద్దీ ఈ విషయంలో ఉత్కంఠ పెరుగుతోంది.

ఇవి కూడా చదవండి

రాష్టప్రతి ఎన్నికలు, ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టడంపై సీఎం కేసీఆర్ పలు పార్టీల అధినేతలో చర్చించినట్లుగా తెలుస్తోంది. ఇదిలావుంటే సీఎం కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలతో కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చేలా లేదు. ఈ కూటమిలోకి కాంగ్రెస్ వచ్చే ప్రశ్నే లేదని తేల్చి చెప్పినట్లుగా సమాచారం. ఒకవేల ఉమ్మడి అభ్యర్థిని రంగంలోకి దింపుతే.. కాంగ్రెస్‌ ఆ అభ్యర్థికి మద్దతివ్వవచ్చని టీఆర్‌ఎస్‌ అనుకుంటోంది.

బీజేపీయేతర పార్టీల మధ్య ఏకాభిప్రాయం సాధించి ప్రతిపక్ష కూటమి తరఫున అభ్యర్థిని నిలబెట్టి గెలిపించుకోవాలని కసరత్తు చేస్తున్నారు. ఇందుకోసం ఆయన ప్రాంతీయ పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే ఈ నెలాఖరున మరోసారి తృణమూల్ కాంగ్రెస్, శివసేన, డీఎంకే, సమాజ్ వాదీ పార్టీ, సీపీఎం నేతలతో చర్చించనున్నారు.

ఈ నేపథ్యంలో దేశ 15వ రాష్ట్రపతి ఎవరు కానున్నరనే దానిపై ఆసక్తికర చర్చనడుస్తోంది. అయితే ఇప్పటికే రాష్ట్రపతి ఎవరు..? అనేదానిపై పలు దఫాలుగా చర్చించింది బీజేపీ. అంతేగాదు మిత్రపక్షాల సలహాలు కూడా తీసుకుంది. ఇక విపక్షాలు సైతం రాష్ట్ర పతి అభ్యర్థిని బరిలోకి దించేందుకు కసరత్తు మొదలుపెట్టాయి. దీంతో ఈ సారి రాష్ట్రపతి ఎన్నికలు మరింత ఆసక్తికరంగా సాగే అవకాశాలున్నాయి.  ప్రస్తుత రాజకీయ సమీకరణాల ప్రకారం రాష్ట్రపతి ఎన్నికను నిర్ణయించే ఎలక్టోరల్‌ కాలేజీలో 10,98,903 ఓట్లు ఉండగా, బీజేపీకి 4,65,797 ఓట్లు, మిత్ర పక్షాలకు 71,329 ఓట్లు ఉన్నాయి. ఈసారి రాష్ట్రపతి ఎన్నికల్లో గెలవాలంటే ఎన్డీఏకు 9,194 ఓట్లు తక్కువ ఉన్నాయి.

Follow Us