పుదుచ్చేరిలో లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌బేడీకి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి ఆందోళన, 10వ తేదీన రాష్ట్రపతి ముందుకి కాంగ్రెస్‌ బృందం

|

Feb 06, 2021 | 1:21 AM

పుదుచ్చేరిలో లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌బేడీకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ ఆందోళనలను ఉధృతం చేసింది. ఎల్‌జీ నివాసం ముందు గత నెల రోజుల నుంచి కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆందోళనలు..

పుదుచ్చేరిలో లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌బేడీకి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి ఆందోళన, 10వ తేదీన రాష్ట్రపతి ముందుకి కాంగ్రెస్‌ బృందం
Follow us on

పుదుచ్చేరిలో లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌బేడీకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ ఆందోళనలను ఉధృతం చేసింది. ఎల్‌జీ నివాసం ముందు గత నెల రోజుల నుంచి కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆందోళనలు చరమాంకానికి చేరాయి. కిరణ్ బేడీ నివాసం ముందు మరోసారి ధర్నా నిర్వహించారు సీఎం నారాయణస్వామి సహా మంత్రులు , కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు. కిరణ్‌బేడీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని ముఖ్యమంత్రి నారాయణ స్వామి విమర్శించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన అనేక బిల్లులకు లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఆమోదముద్ర వేయడం లేదని కాంగ్రెస్‌ ఆరోపించింది. ధర్నాలో సీఎం నారాయణస్వామి కూడా పాల్గొన్నారు. కిరణ్‌బేడీని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ పదవి నుంచి తొలగించాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది.

కాంగ్రెస్‌ ఆందోళనకు సెక్యులర్‌ డెమొక్రటిక్‌ అలయెన్స్‌ కూటమి పార్టీలు కూడా మద్దతు ప్రకటించాయి. కాంగ్రెస్‌ మిత్రపక్షం డీఎంకే మాత్రం ఈ ఆందోళనకు దూరంగా ఉంది. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌బేడీని వెంటనే రీకాల్‌ చేయాలని పీసీసీ అధ్యక్షుడు సుబ్రమణియన్‌ డిమాండ్ చేశారు. గత నెల 8వ తేదీ నుంచి ఎల్‌జీ నివాసం ముందు కాంగ్రెస్‌ నేతల ఆందోళనలు కొనసాగుతున్నాయి. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌బేడీ తీరును నిరసిస్తూ ఈనెల 16వ తేదీన పుదుచ్చేరి బంద్‌కు పిలుపునిచ్చారు సీఎం నారాయణస్వామి. ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రభుత్వం చేస్తున్న ప్రతి పనిలో ఎల్‌జీ తలదూరుస్తున్నారని కాంగ్రెస్‌ నేతలు విమర్శించారు. కిరణ్‌బేడీని పదవి నుంచి తొలగించే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని ప్రకటించారు.

లెఫ్టినెంట్‌ గవర్నర్‌ను తొలగించాలని డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ నేతల ప్రతినిధి బృందం ఈనెల 10వ తేదీన రాష్ట్రపతితో భేటీ కానుంది. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు కాంగ్రెస్‌ నేతలు దీనికి సంబంధించి వినతిపత్రాన్ని కూడా ఇవ్వబోతున్నారు. కిరణ్‌బేడీ నియంతలాగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి. కిరణ్‌బేడీకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ నేతలు ప్రజల నుంచి సంతకాలు సేకరణ కూడా చేపట్టారు.. ఈ సంతకాల పత్రాలను రాష్ట్రపతికి అందచేయబోతున్నారు. అయితే తాను రాజ్యాంగబద్దమైన విధులను మాత్రమే నిర్వహిస్తునట్టు స్పష్టం చేశారు కిరణ్‌బేడీ. ఆమెకు వ్యతిరేకంగా గత నెలరోజుల నుంచి కాంగ్రెస్‌ ఉద్యమాన్ని ఉధృతం చేసింది.

వైసీపీ నేతల మీటింగ్ క్లిప్ నెట్టింట్లో షేర్ చేసిన లోకేష్, విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంలో అడ్డంగా దొరికిపోయారంటూ వ్యాఖ్య