అయోధ్య ఆలయంలో 5 కోట్ల బంగారు పుస్తకం ఎక్కడ..? రిటైర్డ్ ఐఏఎస్ సంచలన ఆరోపణలు..
తల్లి జ్ఞాపకాలను కరిగించి, 800 గ్రాముల బంగారంతో.. అత్యంత భక్తిశ్రద్ధలతో అయోధ్య రామయ్యకు కానుకగా ఇస్తే.. కనీసం రశీదు ఇవ్వకపోగా, ఇప్పుడు ఆ అమూల్యమైన పుస్తకమే కనిపించకుండా పోయింది. అయోధ్య రామమందిరంలో గ్రంథం మాయమైందంటూ కేంద్ర మాజీ హోం కార్యదర్శి లక్ష్మీనారాయణ చేసిన ఆరోపణలు ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతున్నాయి.

అయోధ్య శ్రీరామ మందిరంలో విరాళాల దుర్వినియోగం వ్యవహారం రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతుంది. తాజాగా 1970 బ్యాచ్ ఐఏఎస్ అధికారి, కేంద్ర మాజీ హోం కార్యదర్శి లక్ష్మీనారాయణ చేసిన ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. సుమారు రూ.5 కోట్ల విలువైన బంగారు పూత పూసిన రామచరితమానస్ పుస్తకం ఆలయ ప్రాంగణం నుండి మాయమైందని ఆయన ఆరోపించారు. 2024 ఏప్రిల్లో అంటే రామాలయ ప్రాణప్రతిష్ట జరిగిన తర్వాత మొదటి రామ నవమి వేళ, ఆయన తన కుటుంబం తరపున ఈ ప్రత్యేకమైన రామచరితమానస్ పుస్తకాన్ని ఆలయానికి కానుకగా ఇచ్చారు. సుమారు 150 కిలోల బరువున్న ఈ పుస్తకంలో దాదాపు 800 గ్రాముల బంగారాన్ని ఉపయోగించారు. ముఖ్యంగా తన తల్లికి చెందిన ఆభరణాలను కరిగించి, ఆ బంగారాన్ని పుస్తకం పేజీలకు పూతగా వాడటం వల్ల, అది ఆయన కుటుంబానికి అత్యంత విలువైనదిగా, భావోద్వేగపూరితమైనదిగా మారింది.
రశీదు ఇవ్వలేదు.. పుస్తకం కనిపించలేదు
ఈ కానుకను అందజేసిన సమయంలో ట్రస్ట్ అధికారుల నుండి తనకు ఎటువంటి రశీదు అందలేదని లక్ష్మీనారాయణ తెలిపారు. ఆ తర్వాత కొన్ని నెలలకు, ఆలయాన్ని సందర్శించిన ఆయన బంధువులు ఆ పుస్తకం ఎక్కడా కనిపించడం లేదని చెప్పడంతో ఆయన ఆందోళనకు గురయ్యారు. ఈ విషయంపై ఆయన స్వయంగా అయోధ్యకు వెళ్లి, శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ని కలిశారు. తమ కుటుంబానికి ఎంతో ప్రత్యేకమైన ఆ కానుకను సురక్షితమైన ప్రదేశంలో ఉంచాలని ఆయన కోరారు.
స్పందించని ట్రస్ట్ అధికారులు
చంపత్ రాయ్ని కలిసి విజ్ఞప్తి చేసినప్పటికీ.. అటువైపు నుండి ఎటువంటి సానుకూల స్పందన రాలేదని లక్ష్మీనారాయణ ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై ఆయన ట్రస్ట్ అధికారులకు పలుమార్లు లేఖలు రాసినా, సందేశాలు పంపినా ఫలితం లేకపోయింది. తన పట్ల, తన కుటుంబం పట్ల ట్రస్ట్ వ్యవహరించిన తీరుపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కేవలం ఒక వస్తువుగానే కాకుండా తమ ఆత్మబంధువుగా భావించిన ఆ పుస్తకం అదృశ్యం కావడంపై ఆయన స్పష్టత కోరుతున్నారు.
ఆలయ నిధులపై ఇప్పటికే కొనసాగుతున్న దర్యాప్తు
ఈ ఆరోపణలు ఇప్పుడు ఆలయ ట్రస్ట్లో జరుగుతున్నట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో వివాదానికి కొత్త తోడయ్యాయి. ఆలయానికి వచ్చిన విరాళాలలో దాదాపు రూ.7 నుంచి 7.5 కోట్ల రూపాయల మేర దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలపై ఇప్పటికే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఎనిమిది మందిని అరెస్టు చేశారు. విరాళాలను సేకరించే, లెక్కించే బాధ్యతల్లో ఉన్న వ్యక్తుల పాత్రపై పోలీసులు లోతైన దర్యాప్తు జరుపుతున్నారు.
ఈ తాజా ఘటనతో అయోధ్య రామాలయ ట్రస్ట్ నిర్వహణ, విరాళాల భద్రత, పారదర్శకతపై దేశవ్యాప్తంగా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అత్యంత పవిత్రంగా భావించే శ్రీరామ మందిరంలో జరిగిన ఈ వ్యవహారం భక్తుల నమ్మకాలను ప్రశ్నార్థకం చేస్తోందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
