
అన్నదాతల ఆగ్రహ జ్వాలలు రగులుతూనే ఉన్నాయి. నూతన వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ సరిహద్దులో రైతులు చేస్తున్న ధర్నా శుక్రవారానికి 23వ రోజుకు చేరింది. ఇప్పటికే పలువురు ప్రముఖులు సైతం రైతులకు మద్దతు తెలుపుతున్నారు. తాజాగా బాక్సర్ , కాంగ్రెస్ నేత విజేందర్ సింగ్ మద్దతు తెలిపారు. ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన చేస్తున్న రైతులకు విజేందర్ సింగ్ ఆహారం పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. రైతు వ్యతిరేక చట్టాలను కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రైతులు చేస్తున్న ఈ పోరాటం ప్రభుత్వానికో పార్టీకో వ్యతిరేకం కాదు. ఈ పోరాటం ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరకంగా చేస్తున్నారని అన్నారు. కేంద్రం నూతన వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకోవాలని, లేకుంటే తన రాజీవ్ ఖేల్రత్న అవార్డును వెనుక్కు ఇచ్చేస్తానని విజేందర్ సింగ్ ప్రకటించారు.