లక్షల్లో జీతం, లగ్జరీ లైఫ్ పేరుతో వల.. తీరా చూస్తే ఈడీ అధికారులే షాక్..!

ఉత్తరప్రదేశ్‌ నోయిడాలోని భారీ హైటెక్ వ్యభిచార రాకెట్‌ గుట్టరట్టు అయింది. లక్షల్లో జీతం, లగ్జరీ లైఫ్ పేరుతో వల వేసి.. పలువురు యువతులను వ్యభిచార రొంపిలోకి దింపతున్న ఓ జంట దందాను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్(ఈడీ) బట్టబయలు చేసింది. అడల్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ వెబ్‌సైట్‌లను నిర్వహిస్తున్నట్లు తేల్చారు. ఈడీ దాడుల్లో 15.66 కోట్ల రూపాయల అక్రమ విదేశీ నిధులను స్వాధీనం చేసుకున్నారు.

లక్షల్లో జీతం, లగ్జరీ లైఫ్ పేరుతో వల.. తీరా చూస్తే ఈడీ అధికారులే షాక్..!
Police Arrest

Updated on: Mar 31, 2025 | 8:56 AM

ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాకు చెందిన ఉజ్వల్ కిషోర్, అతని భార్య నీలు శ్రీవాస్తవ.. ఏకంగా వ్యభిచార రాకెట్‌ నడుపుతూ అడ్డంగా బుక్కయ్యారు. గత ఐదేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా.. తమ నివాసంలోనే ఈ దందాను నిర్వహిస్తున్న ఉజ్వల్ కిషోర్‌ జంట బాగోతాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్(ఈడీ) అధికారులు బహిర్గతం చేశారు. అసభ్యకర వీడియోలను ప్రసారం చేస్తూ డబ్బులు సంపాదిస్తున్న దంపతులను నోయిడా పోలీసులు అరెస్ట్‌ చేశారు.

దేశ రాజధాని ఢిల్లీ శివారు నోయిడాలో మార్కెటింగ్‌, అడ్వర్‌టైజింగ్‌ రీసెర్చ్ పేరుతో తప్పుడు వివరాలను సృష్టించి డబ్బులను విదేశీ కంపెనీలకు తరలిస్తున్నారన్న సమాచారంతో ఈడీ అధికారులు.. దంపతుల నివాసంలో దాడులు చేశారు. దాంతో.. సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సైప్రస్‌ దేశానికి చెందిన టెక్నియస్ లిమిటెడ్ అనే సంస్థతో ఈ జంటకు సంబంధాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అడల్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ వెబ్‌సైట్‌లను నిర్వహిస్తున్నట్లు తేల్చారు. ఈడీ దాడుల్లో 15.66 కోట్ల రూపాయల అక్రమ విదేశీ నిధులను స్వాధీనం చేసుకున్నారు.

ఇక.. ఈ జంట echato dot com(ఇచాటో డాట్‌ కమ్‌) పేరుతో ఒక పేజీని సృష్టించి, ఆకర్షణీయమైన జీతాలు ఇస్తామనే ప్రకటనలతో యువతులను అట్రాక్ట్‌ చేసి మోసం చేస్తున్నట్లు గుర్తించారు. ఢిల్లీ-ఎన్‌సిఆర్ ప్రాంతానికి చెందిన చాలామంది మహిళలు ఇలాంటి యాడ్స్‌తోనే ఆకర్షితులయ్యారని.. వారికి నెలకు లక్ష నుండి 2 లక్షల రూపాయల వరకు ఇస్తామని ఆశ చూపి వ్యభిచార కూపంలోకి దింపారని ఈడీ అధికారులు వెల్లడించారు. దాడి సమయంలో అక్కడే ఉన్న ముగ్గురు మహిళల నుంచి ఈడీ స్టేట్ మెంట్ రికార్డ్‌ చేసింది. ఈ దందా ద్వారా సంపాదించిన ఆదాయంలో 75 శాతం ఉంచుకుని.. 25 శాతం మాత్రమే మోడల్స్‌కు ఇస్తూ గుట్టుచప్పుడు కాకుండా దందా నడుపుతున్నారని ఈడీ అధికారులు తెలిపారు. ఈ రాకెట్‌ దందాలో వేలాదిమంది మహిళలు చిక్కుకుని ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఈడీ అధికారులు పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..