Cm Arvind Kejriwal: కేంద్రం తెచ్చిన మూడు వివాదాస్పద రైతు చట్టాలు అన్నదాతలకు డెత్ వారంట్లని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. యూపీ లోని మీరట్ లో ఆదివారం జరిగిన కిసాన్ మహాపంచాయత్ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన.. రైతుల భూములను తీసేసుకుని వాటిని ముగ్గురు, నలుగురు కేపిటలిస్టులకు అందజేయాలని ప్రభుత్వం భావిస్తోందని, అప్పుడు తమ సొంత భూముల్లోనే అన్నదాతలు వ్యవసాయ కూలీలుగా మారుతారని అన్నారు. ఆ సందర్భంలో వారికి ‘డూ ఆర్ డై’ (చావో..రేవో)’ అనే పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. ఇదే సందర్భంలో అరవింద్ కేజ్రీవాల్..యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సహా బీజేపీ నేతలను తీవ్రంగా విమర్శించారు. వీరు అబధ్ధాలకోరులని అన్నారు. కనీస మద్దతుధర ఉంటుందని, ఇది కొనసాగుతుందని ప్రధాని మోదీ ఆ మధ్య పార్లమెంటులో చేసిన వ్యాఖ్యను ఆయన గుర్తు చేస్తూ.. నిజంగా రైతులకు మండీలో ఈ ధర లభిస్తోందా అని ప్రశ్నించారు. యోగి ఆదిత్యనాథ్ సహా బీజేపీ నాయకులంతా రోజూ అబద్దాలు చెబుతూనే ఉంటారని అరవింద్ కేజ్రీవాల్ దుయ్యబట్టారు.
చెరకు రైతులకు చెల్లింపులు జరిగేలా చూడలేని ఈ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కూడా ఒక ప్రభుత్వమేనా అని, ఇది సిగ్గుచేటని కేజ్రీవాల్ తీవ్రంగా వ్యాఖ్యానించారు. ప్రభుత్వాలకు చిత్తశుద్ది ఉంటే ఈ విధమైన సమస్యలు పరిష్కారమవుతాయని ఆయన చెప్పారు. పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెరగడాన్ని ఆయన విమర్శిస్తూ.. అంతర్జాతీయంగా వీటి ధరలు తగ్గినప్పటికీ కేంద్రం మాత్రం వీటి ధరలను పెంచుతూనే ఉందన్నారు. ప్రజలు ఈ పెంపు మీద ఉద్యమమే చేయాలనీ ఆయన అభిప్రాయపడ్డారు.
కాగా ఈ కిసాన్ మహా పంచాయత్ కార్యక్రమంలో యూపీ నుంచే గాక,,పొరుగునున్న హర్యానా, పంజాబ్ రాష్ట్రాల రైతులు కూడా పాల్గొన్నారు. మీది జాతీయ ఉద్యమమని, చివరకు కేంద్ర ప్రభుత్వం మీ ముందు తలవంచక తప్పదని కేజ్రీవాల్ అన్నారు. రైతులకు తాము ఎప్పుడూ అండగా ఉంటామన్నారు. ఢిల్లీ సరిహద్దుల్లోని సింఘు బోర్డర్ లో ఆందోళన చేస్తున్న రైతులను తను పలుమార్లు పరామర్శించానని, వారికీ అండగా ఉంటానని హామీ ఇచ్చానని ఆయన గుర్తు చేశారు.
Read More: