
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇటీవల ఒక ముఖ్యమైన ఆరోగ్య హెచ్చరిక జారీ చేసింది. రెండు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లోనూ దగ్గు సిరప్లు ఇవ్వకూడదని స్పష్టంగా పేర్కొంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్లలో దగ్గు సిరప్ వల్ల 12 మంది పిల్లలు మరణించినట్లు వార్తలు రావడంతో కేంద్రం ఇటువంటి హెచ్చరిక జారీ చేసింది. రెండేళ్లలోపు చిన్నారులకు దగ్గు, జలుబు మందులు సూచించడంకానీ, ఇవ్వడంకానీ చేయకూడదని ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వాలకు నిర్దేశించింది. ఈమేరకు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ శుక్రవారం అన్ని రాష్ట్రాల వైద్యారోగ్య సేవల డైరెక్టర్లకు లేఖలు రాసింది.
పరీక్షించిన నమూనాలలో మూత్రపిండాలకు హాని కలిగించే విషపూరిత రసాయనాలు ఏవీ కనుగొనబడలేదని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీని అర్థం పిల్లల మరణాలకు ఔషధంతో నేరుగా సంబంధం లేదు, కానీ పిల్లల భద్రతకు ఈ హెచ్చరిక చాలా ముఖ్యమైనది. చాలా సందర్భాల్లో ఎలాంటి మందులు వాడకుండానే దగ్గు సమస్య దానంతట అదే తగ్గిపోతుంది. అందువల్ల రెండేళ్లలోపు చిన్నారులకు దగ్గు, జలుబు మందులు రాయడంకానీ, ఇవ్వడంకానీ చేయకూడదు. సాధారణంగా ఇలాంటివి 5 ఏళ్లలోపు చిన్నారులకు సిఫార్సు చేయరు. అంతకుమించిన వయసు వారికి ఇలాంటి మందులు వాడేట్లయితే తప్పనిసరిగా ఔషధ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని ఎంత మోతాదు ఎంతకాలం ఇవ్వాలన్న విషయంలో నిబంధనలు పాటించాలని కేంద్రం తన లేఖలో పేర్కొంది.
DGHS (Directorate General of Health Services) issues advisory on rational use of cough syrups in paediatric population
“Cough and cold medications should not be prescribed or dispensed to children under 2 years. These are generally not recommended for ages below 5 years and… pic.twitter.com/gqQ94VJIqx
— ANI (@ANI) October 3, 2025
మరోవైపు రాజస్థాన్, మధ్యప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో పెద్దలకు వాడే దగ్గు సిరప్ తాగి 12మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ సిరప్ను జైపుర్కు చెందిన కేసన్స్ అనే ఔషధ సంస్థ తయారు చేసింది. రెండేళ్లుగా ఈ సిరప్పై జరిపిన నాణ్యతా పరీక్షల్లో 40 నమూనాలు విఫలమైనట్లు గుర్తించిన అధికారులు తాత్కాలికంగా నిషేధం విధించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి…