Delhi High Court: దేశంలో కరోనా విస్తృతంగా వ్యాప్తి చెందుతోంది. దేశంలో నెలకొన్న ఆక్సిజన్ కొరతపై ఢిల్లీ హైకోర్టు సీరియగా స్పందించింది. ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరతకు సంబంధించి మాక్స్ దాఖలు చేసిన పిటీషన్ హైకోర్టు అత్యవసరంగా విచారణగా స్వీకరించింది. ఈ సందర్బంగా కేంద్ర ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆక్సిజన్ నిల్వలు అయిపోతూ ఆస్పత్రుల్లో ఆందోళన పరిస్థితి ఉంటే స్టీలు ప్లాంట్లు నడుస్తున్న వైనం తమకు షాకింగ్గా ఉందని కోర్టు వ్యాఖ్యానించింది. తక్షణమే ఆక్సిజన్ కొరత సమస్య పరిష్కారం కోసం స్పెషల్ కారిడార్ను ఏర్పాటు చేయాలని సూచించింది. న్యాయమూర్తులు విపిన్ సంఘి, రేఖపల్లిల ధర్మాసనం చేపట్టిన ఈ అత్యవసర విచారణలో తాజా ఆదేశాలు జారీ చేసింది. తీవ్రంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న వైద్య ఆక్సిజన్ అవసరమయ్యే పౌరుల జీవన హక్కుల పరిరక్షించేందుకు బాధ్యత కేంద్రంపై ఉందని తెలిపింది. ఆక్సిజన్ సరఫరా కోసం పరిశ్రమలు కొన్ని రోజులు వెయిట్ చేయవచ్చు.. కానీ ఇబ్బందుల పరిస్థితుల్లో ఉన్న రోగులు వెయిట్ చేయలేరు అంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది.
1400 మంది కోవిడ్ పేషెంట్లు ఉన్న దేశ రాజధానిలోని ఆరు మాక్స్ ఆస్పత్రులకు అత్యవసరంగా ఆక్సిజన్ సరఫరా ఉండేలా చూడాలని ఢిల్లీ కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అవసరమైతే, పరిశ్రమల మొత్తం సరఫరాను మళ్లించాలని తెలిపింది. ఆరు ఆస్పత్రుల యాజమాన్యంలోని బాలాజీ మెడికల్ అండ్ రీసెర్చ్ సెంటర్ దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన కోర్టు ఆక్సిజన్ సరఫరా తక్షణ ప్రాతిపదికన భర్తీ చేయకపోతే, రోగుల జీవితాలు ప్రమాదంలో పడతాయని పేర్కొంది. ప్రతి ఒక్కరూ ఈ సమయంలో సహాయం చేయడానికి రెడీగా ఉండాలని కోర్టు తెలిపింది.