
ట్రాన్స్జెండర్లకు యూపీ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. దేశంలోనే తొలిసారిగా ట్రాన్స్జెండర్ల కోసం ప్రత్యేక యూనివర్సిటీని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. రాష్ట్రంలోని కుషినగర్లో ఈ విశ్వ విద్యాలయాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఆలిండియా ట్రాన్స్జెండర్ ఎడ్యుకేషన్ సర్వీస్ ట్రస్ట్ ఈ విశ్వ విద్యాలయాన్ని నెలకొల్పనుంది. ట్రాన్స్జెండర్ల కోసం.. ప్రత్యేకంగా ఓ యూనివర్సిటీ నెలకొల్పడం.. దేశంలో ఇదే మొదటిది కానుందని.. ఇప్పటికే ఈ యూనివర్సిటీకి సంబంధించిన ప్రక్రియ ప్రారంభమైందని.. ఆలిండియా ట్రాన్స్జెండర్ ఎడ్యుకేషన్ సర్వీస్ ట్రస్ట్ అధ్యక్షుడు డాక్టర్ కృష్ణ మోహన్ మిశ్రా వెల్లడించారు. ఇక ఈ విశ్వవిద్యాలయంలో.. ఫస్ట్ క్లాస్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు అభ్యసించవచ్చని తెలిపారు. అంతేకాదు.. వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి నుంచి క్లాస్లు ప్రారంభం కానున్నట్లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే గంగా సింగ్.. ట్రాన్స్జెండర్లు విద్యనభ్యసించి.. ఉన్నతస్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఇక ఈ విశ్వ విద్యాలయం ఏర్పాటుపై ట్రాన్స్జెండర్లు హర్షం వ్యక్తం చేశారు.