Corporate Hospitals: అవును, అది నిజమే.. ప్రైవేటు ఆస్పత్రులపై ‘సీసీఐ’ సంచలన నివేదిక..

|

Sep 24, 2022 | 3:52 PM

Corporate Hospitals: అనారోగ్యంతో ‌ ఆస్పత్రుల్లో చేరే రోగులను కార్పొరేట్‌ ఆస్పత్రులు పీల్చి పిప్పి చేస్తున్నాయని వస్తున్న ఆరోపణలు నిజమేనని తేలింది.

Corporate Hospitals: అవును, అది నిజమే.. ప్రైవేటు ఆస్పత్రులపై ‘సీసీఐ’ సంచలన నివేదిక..
Cci
Follow us on

Corporate Hospitals: అనారోగ్యంతో ‌ ఆస్పత్రుల్లో చేరే రోగులను కార్పొరేట్‌ ఆస్పత్రులు పీల్చి పిప్పి చేస్తున్నాయని వస్తున్న ఆరోపణలు నిజమేనని తేలింది. పేరున్న కార్పొరేట్‌ ఆస్పత్రులు జనాల నుంచి భారీగా వసూళ్లకు పాల్పడుతున్నాయని కాంపిటిషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా దర్యాప్తులో తేలింది. ధరల నియంత్రణకు సంబంధించి ఎటువంటి చట్టం లేకపోవడం కార్పొరేట్‌ ఆస్పత్రులకు వరంగా మారింది. అడ్డదిడ్డంగా ధరలు వసూలు చేసే జాబితాలో దేశంలోని పేరెన్నికగన్న ఆస్పత్రులు ఉన్నాయి. ఢిల్లీ, NCR పరిధిలోని అపోలో హాస్పిటల్స్‌, మ్యాక్స్‌ హెల్త్‌ కేర్‌, ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌, సర్‌ గంగారామ్‌ హాస్పిటల్‌, బాత్రా హాస్పిటల్‌, సెయింట్‌ స్టీఫెన్‌ హాస్పిటల్‌ వంటివి ఈ జాబితాలో ఉన్నాయని కాంపిటిషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా దర్యాప్తులో తేలింది.

ఫీజుల పేరుతో ప్రజలను నరకయాతనకు గురిచేస్తున్న ఈ ఆస్పత్రుల వ్యవహారంపై CCI నాలుగేళ్లుగా దర్యాప్తు చేస్తోంది. NCR పరిధిలోని 12 సూపర్‌ స్పెషలిటీ ఆస్పత్రులు తమ పేరు ప్రఖ్యాతలను ఆసరాగా చేసుకొని రూమ్‌‌ రెంట్స్‌‌, మెడిసిన్స్‌, మెడికల్‌ టెస్టులు, డివైసుల పేరుతో రోగుల నుంచి భారీగా డబ్బు వసూలు చేస్తున్నాయని CCI నివేదిక వెల్లడించింది. కొన్ని ఆస్పత్రుల్లో రోగులకు కేటాయించే గదుల అద్దె త్రీ స్టార్‌, ఫోర్‌ స్టార్‌ హోటల్స్‌ను తలదన్నేలా ఉందని CCI దర్యాప్తులో తేలింది.

ఆస్పత్రుల్లో అధిక ధరలపై దేశంలో నిర్వహించిన తొలి దర్యాప్తు ఇది. ఆస్పత్రుల్లో వసూలు చేసే ఫీజుల నియంత్రణపై దేశంలో ఇంత వరకు ఎటువంటి చట్టం లేదు. ఈ క్రమంలో CCI చేపట్టిన దర్యాప్తు ఆస్పత్రుల వ్యవహారాలకు కళ్లెం వేయనుంది. NCR పరిధిలో ఇలాంటివి 12 సూపర్‌ స్పెషలిటీ ఆస్పత్రులున్నట్టు CCI గుర్తించింది. ఈ పన్నెండు ఆస్పత్రుల్లో ఆరు మ్యాక్స్‌కు చెందినవి కాగా ఫోర్టిస్‌కు చెందినవి రెండున్నాయి.

ఇవి కూడా చదవండి

ప్రముఖ ఆస్పత్రుల తీరు ఏ మాత్రం సమంజసంగా లేదని నిర్థారణకు వచ్చిన CCI -వీటిపై భారీ జరిమానా విధించేందుకు సిద్ధమవుతోంది. ఈ ఆస్పత్రుల గడిచిన మూడేళ్ల టర్నోవర్‌పై 10 శాతం జరిమానా విధించే సూచనలున్నాయి. ఈ విషయంలో అపోలో హాస్పిటల్స్‌పై భారీ జరిమానా పడే అవకాశం ఉంది. అపోలో హాస్పిటల్స్‌ గడిచిన మూడేళ్ల సగటు వార్షిక టర్నోవర్‌ 12 వేల 206 కోట్లుగా ఉంది. దీనిపై పది శాతం జరిమానా విధించడం తథ్యంగా కనిపిస్తోంది. NCRలోని మరో ప్రముఖ ఆస్పత్రి ఫోర్టిస్‌ వార్షిక టర్నోవర్‌ 4వేల 834 కోట్లుగా ఉంది.

ఈ ఆస్పత్రులు రోగుల నుంచి విపరీతంగా ఫీజులు వసూలు చేశాయని CCI దర్యాప్తులో తేలింది. ఎక్స్‌రేలు, MRI, ఆల్ట్రా సౌండ్‌ స్కానింగ్‌కు ఇతర డయాగ్నాస్టిక్‌ సెంటర్స్‌తో పోల్చితే ఈ ఆస్పత్రుల్లో విపరీతంగా డబ్బు వసూలు చేసినట్టు తేలింది. ఇక సిరంజీలు, బ్లేడ్లకు అయితే అడ్డగోలుగా రోగుల నుంచి ముక్కు పిండి వసూలు చేసినట్టు గుర్తించారు. ట్యాబ్లెట్స్‌ను ఈ ఆస్పత్రులు MRPకే అమ్మినట్టు తేలింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..