Corona Effect: కరోనా వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇతర ప్రాంతాల నుంచి పంజాబ్కు వచ్చే వారిపై కఠిన ఆంక్షలు విధించింది. కరోనా నెగిటివ్ రిపోర్ట్, టీకా వేయించుకున్నట్లు ధ్రువపత్రం లేనట్లయితే పంజాబ్లో ప్రవేశం లేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. కరోనా నెగిటివ్ రిపోర్ట్ లేదా టీకా సర్టిఫికెట్ లేకుంటే పంజాబ్ రాష్ట్రంలోకి విమానం, రైలు, రోడ్డు ద్వారా ఎవరూ ప్రవేశించడానికి వీల్లేదని సర్కారు స్పష్టం చేసింది. ఎవరైనా ఆ రెండూ లేకుండా వచ్చినట్లయితే వెనక్కి పంపించడం జరుగుతుందని తేల్చి చెప్పింది.
ఇదిలాఉంటే.. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు గానూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 15వ తేదీ వరకు లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. రాత్రి 6 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ విధించింది. అలాగే.. శుక్రవారం నుంచి సోమవారం వరకు వీకెండ్ కర్ఫ్యూను కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కాగా, అన్ని నిత్యావసరేతర దుకాణాలు, షాపింగ్ మాల్స్లను మూసివేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అలాగే వీధి వ్యాపారులకు ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయాలని అధికారులను రాష్ట్ర సర్కార్ ఆదేశించింది. కాగా, రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 7,327 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవగా.. ఒక్క రోజులోనే కరోనా కారణంగా 157 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలోనే అప్రమత్తమైన పంజాబ్ గవర్నమెంట్.. కఠిన ఆంక్షలు అమలుకు ఉపక్రమిస్తోంది.
Also read:
Horoscope Today: ఈ రాశివారికి ఈ రోజు వచ్చే బాకీలు వసూలు అవుతాయి.. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం
Sai Pallavi : క్రేజీ హీరో విజయ్ దేవరకొండతో అందాల భామ సాయిపల్లవి జతకట్టనుందా..?