Covid-19 News: కరోనా విలయతాండవం…కేంద్రానికి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కీలక సూచనలు

|

Apr 17, 2021 | 6:00 PM

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీనుద్దేశించి మాట్లాడిన ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ...కోవిడ్ వ్యాక్సిన్ల సరఫరా విషయంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపుతోందని ఆరోపించారు.

Covid-19 News: కరోనా విలయతాండవం...కేంద్రానికి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కీలక సూచనలు
Sonia Gandhi
Follow us on

దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(CWC) శనివారం సమావేశమై…దేశంలో నెలకొంటున్న కరోనా సంక్లిష్ట పరిస్థితులపై చర్చించింది. కేంద్రానికి కీలక సూచనలు చేసింది. కోవిడ్ పేషెంట్స్‌ చికిత్సకు వినియోగించే అన్ని రకాల లైఫ్ సేవింగ్స్ డ్రగ్స్‌, వైద్య పరికరాలపై జీఎస్టీని మినహాయింపు ఇవ్వాలని కోరింది. అలాగే దేశంలో 25 ఏళ్లకు పైబడిన అందరికీ కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరింది. కోవిడ్ వ్యాక్సినేషన్ వయోపరిమితిని 25 ఏళ్లకు తగ్గించడం ద్వారా యువకులకు ప్రయోజనం చేకూరుతుందని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ప్రస్తుతం 45 ఏళ్లకు పైబడిన వారికి మాత్రమే కోవిడ్ వ్యాక్సిన్లు ఇస్తుండటం తెలిసిందే.

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీనుద్దేశించి మాట్లాడిన ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ…కోవిడ్ వ్యాక్సిన్ల సరఫరా విషయంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపుతోందని ఆరోపించారు. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీకి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బీజేపీయేతర ముఖ్యమంత్రులు లేఖ రాసినా ప్రయోజనం దక్కడం లేదన్నారు. కోవిడ్ ఆంక్షలు, ఆర్థిక కార్యకలాపాల్లో స్తబ్ధత కారణంగా ఉపాధిని కోల్పోయిన పేదలను నెలకు రూ.6000 ఆర్థిక సాయాన్ని అంజేయాలని సూచించారు. వలస కార్మికులు తిరిగి తమ స్వస్థలాలకు చేరుకునేందుకు తగిన రవాణా వసతులు కల్పించాలని…వారి స్వస్థలాల్లో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

కోవిడ్ సెకండ్ వేవ్‌ను ఎదుర్కొనే విషయంలో మోదీ సర్కారుకు ముందుచూపు కొరవడిందని సోనియా గాంధీ ధ్వజమెత్తారు.కోవిడ్ సంక్షోభాన్ని ఎదుర్కొనే విషయంలో కేంద్రానికి నిర్మాణాత్మక సలహాలు ఇస్తున్న విపక్ష నేతలపై కేంద్ర మంత్రులు విమర్శల దాడి చేయడం సరికాదన్నారు. దేశంలో కరోనా సంక్లిష్ట పరిస్థితులు నెలకొన్న తరుణంలో కోవిడ్ వ్యాక్సిన్లను విదేశాలకు ఎగుమతి చేయడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. సొంత దేశంలో వేలాది మంది ప్రజలు కోవిడ్ కారణంగా బలవుతుంటే…విదేశాల పట్ల మోదీ సర్కారు ఉదారత చూపుతోందని ఎద్దేవా చేశారు.

ఇవి కూడా చదవండి..కరోనా కట్టడికి ఒక్క మాస్క్ సరిపోదా..? కాటన్ మాస్కుకు తోడు సర్జికల్ మాస్కు కలవాల్సిందేనా..?

కరోనా టీకా రెండు డోసులూ తీసుకోవాల్సిందేనా..రెండో డోసు ఎందుకు తీసుకోవాలి? నిపుణులు ఏమంటున్నారు?