Priyanka Gandhi: వయనాడ్‌లో ప్రియాంక గాంధీ నామినేషన్‌.. హాజరైన అగ్రనేతలు.. భారీ రోడ్ షో..

వయనాడ్‌ను నిలుపుకోవడం, కేరళ అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్‌గా కాంగ్రెస్‌ పావులుకదుపుతోంది.. దీనికోసం కాంగ్రెస్‌ అగ్ర నాయకత్వం వయనాడ్‌లో మెగా షో నిర్వహించింది.. అగ్రనేతలంతా ప్రియాంక గాంధీ నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు..

Priyanka Gandhi: వయనాడ్‌లో ప్రియాంక గాంధీ నామినేషన్‌.. హాజరైన అగ్రనేతలు.. భారీ రోడ్ షో..
Priyanka Gandhi

Updated on: Oct 23, 2024 | 2:04 PM

Priyanka Gandhi Nomination: వయనాడ్‌ పార్లమెంట్ స్థానానికి ప్రియాంక గాంధీ నామినేషన్‌ దాఖలు చేశారు. ప్రియాంక నామినేషన్‌ కార్యక్రమానికి ఆమె భర్త రాబర్ట్‌ వాద్రా, పిల్లలు హాజరయ్యారు. అంతేకాకుండా ప్రియాంక వెంట ఆమె తల్లి సోనియా గాంధీ, సోదరుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పలువురు అగ్రనేతలు కూడా హాజరయ్యారు. స్థానిక నేతల సమక్షంలో ప్రియాంక గాంధీ నామినేషన్ పత్రాలపై సంతకం చేశారు. నామినేషన్‌ కార్యక్రమానికి ముందు వయనాడ్‌ కల్పేటలో మెగా రోడ్‌షో నిర్వహించారు. కాగా.. పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ, వయనాడ్, రాయ్‌బరేలీ నుంచి గెలుపొందారు.. రెండు సీట్లలో గెలుపొందడంతో రాహుల్ వాయనాడ్ సీటును వదులుకున్నారు. వయనాడ్ సీటు ఖాళీ కావడంతో ఇక్కడ ఉప ఎన్నిక జరుగుతోన్న విషయం తెలిసిందే..

రోడ్ షో అనంతరం ఓ సభలో ప్రియాంక గాంధీ ప్రసంగిస్తూ.. తొలిసారిగా తన కోసం తాను ప్రచారం చేసుకుంటున్నట్లు తెలిపారు. తన సోదరుడు రాహుల్ గాంధీ విద్వేషానికి వ్యతిరేకంగా ప్రయాణించాడని.. వాయనాడ్ అభ్యర్థిగా తనకు మద్దతు ఇచ్చినందుకు యూడీఎఫ్, కాంగ్రెస్ నేతలందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. ప్రతి సందర్భంంలోనూ తాను వాయనాడ్‌కు అండగా ఉంటానన్నారు. ఈ సరి కొత్త ప్రయాణంలో ప్రజలే తనకు మార్గదర్శకమన్నారు. తనకు 17 సంవత్సరాల వయస్సు నుంచి.. దాదాపు 35 సంవత్సరాలుగా వివిధ ఎన్నికల కోసం ప్రచారం చేస్తున్నానని.. ఇంతకాలం తన తల్లి, సోదరుడు, తన పార్టీ కార్యకర్తల కోసం ప్రచారం చేశానని.. ఇప్పుడు స్వయంగా ప్రచారం చేసుకోవడం ఇదే తొలిసారంటూ ప్రియాంక పేర్కొన్నారు. అవకాశం ఇస్తే వయనాడ్ తరపున ప్రాతినిధ్యం వహిస్తానని వివరించారు.

వయనాడ్‌ను నిలుపుకోవడం, కేరళ అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్‌గా కాంగ్రెస్‌ పావులుకదుపుతోంది.. దీనికోసం కాంగ్రెస్‌ అగ్ర నాయకత్వం వయనాడ్‌లో మెగా షో నిర్వహించింది.. అగ్రనేతలంతా ప్రియాంక గాంధీ నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు.. వయనాడ్‌ను తిరిగి నిలబెట్టుకోవడం.. త్వరలో జరగబోయే కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా కాంగ్రెస్ అగ్రనేతలంతా రంగంలోకి దిగారు.. ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్టుగా ఇటు వయనాడ్‌ను.. అటు కేరళను తన ఖాతాలో వేసుకోవడానికి పావులు కదుపుతోంది. ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కేరళ వరకు మంచి ఫలితాలు సాధించింది కాంగ్రెస్‌. కేరళలో 20 ఎంపీ స్థానాలు ఉంటే.. 18 సీట్లను కాంగ్రెస్‌ కూటమి UDF గెలుచుకుంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న LDF.. ఒకే ఒక్క స్థానానికే పరిమితమైంది. దాంతో, కేరళలో ఈసారి తమదే అధికారమన్న ధీమాతో ఉంది కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి ముందుకువెళ్తోంది..

వయనాడ్‌ గత సంవత్సరాల నుంచి కాంగ్రెస్‌ అడ్డాగా మారింది. 2009 నుంచి ఇక్కడ కాంగ్రెస్‌ గెలుస్తూ వస్తోంది. 2019లో సుమారు 65శాతం ఓట్లతో రాహుల్‌గాంధీ విజయం సాధించగా.. 2024లో దాదాపు 60శాతం ఓట్‌ షేర్‌తో ఆ ఫీట్‌ను పునరావృతం చేశారు. దాంతో, ఇప్పుడు ప్రియాంకాగాంధీ గెలుపు లాంఛనమేనన్న మాట వినిపిస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us