Congress Leader Sachin Pilot: రాజస్థాన్ కాంగ్రెస్లో ముసలం పుట్టింది. త్వరలో ఆ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ ఫైలట్ ఆ పార్టీ వీడనున్నారు. త్వరలోనే భారతీయ జనతా పార్టీలో చేరనున్నట్లు రాజస్ధాన్ బీజేపీ నేత ఏపీ అబ్ధుల్లాకుట్టి చేసిన వ్యాఖ్యలు మరోసారి కలకలం రేపుతున్నాయి.
ఏడాది కిందట రాజస్థాన్లో ఏర్పడిన రాజకీయ సంక్షోభం టీకప్పులో తుఫాను మాదిరిగా సమసిపోయింది. అయితే, అసమ్మతి మాత్రం నివురుగప్పిన నిప్పులా కొనసాగుతోంది. ఆ రాష్ట్ర డిఫ్యూటీ సీఎం సచిన్ పైలట్ వర్గానికి త్వరలో జరగబోయే కేబినెట్ విస్తరణలో సముచిత స్థానం దక్కకపోతే మూల్యం చెల్లించుకోక తప్పదనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో సచిన్ పైలట్ బీజేపీలో చేరవచ్చని అబ్ధుల్లాకుట్టి ఆశాభావం వ్యక్తం చేశారు. ‘సచిన్ చాలా మంచి నాయకుడు.. భవిష్యత్తులో ఆయన బీజేపీలో చేరవచ్చు’ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలతో సచిన్ పైలట్ కాషాయ తీర్దం పుచ్చుకుంటారని మళ్లీ ఊహాగానాలు ఊపందుకున్నాయి.
రాజస్ధాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్పై గత ఏడాది సచిన్ పైలట్ వర్గం ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసిన సమయంలోనూ ఆయన బీజేపీలో చేరతారనే ప్రచారం సాగింది. దీంతో ఏకంగా కాంగ్రెస్ అధిష్టానమే జోక్యం చేసుకుని పార్టీ అంతర్గ విభేదాలకు చెక్ పెట్టారు. కాగా, రాజస్ధాన్లో కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురావడానికి కాషాయ పార్టీతో పోరాడిన తాను బీజేపీలో చేరుతాననడం అసంబద్ధమని అప్పట్లో పైలట్ తోసిపుచ్చారు. తాను బీజేపీలో చేరబోనని రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో భేటీ అనంతరం ప్రకటించారు.
ఇదిలా ఉండగా, ఈ నెలలో రాజస్ధాన్లో మరోసారి మంత్రివర్గ విస్తరణ, కీలక పదవుల నియామకాలు చేపడతారనే వార్తల నేపథ్యంలో పైలట్ బీజేపీ తీర్థం పుచ్చుకుంటారనే ప్రచారం మళ్లీ జరుగుతోంది. పైలట్ శిబిరం డిమాండ్లు ఊపందుకోవడంతో ఈ నెలలో జరిగే విస్తరణలో ఆయన వర్గీయులకు కీలక పదవులు ఇవ్వడంతో పాటు, రాజకీయ నియామకాల్లోనూ ప్రాధాన్యం ఇస్తారని భావిస్తున్నారు.
అటు, అబ్దుల్లాకుట్టి వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన దిష్టిబొమ్మను దగ్దం చేశారు. జయపూర్లో రాజస్థాన్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి సాదిక్ చౌహన్ ఆధ్వర్యంలో బీజేపీ నేత దిష్టిబొమ్మ దహనం జరిగింది. ఈ సందర్భంగా సాదిక్ మాట్లాడుతూ.. రాజస్థాన్ బీజేపీ అధ్యక్షుడి వ్యాఖ్యలు దురదృష్టకరమని, ఆర్ఎస్ఎస్ మాటలే ఆయన నోటి నుంచి వచ్చాయని అన్నారు. ఇదంతా బీజేపీ కుట్రలో భాగమేనని దుయ్యబట్టారు. కాంగ్రెస్ శ్రేణులను గందరగోళంలోకి నెట్టాలనే ఇటువంటి ప్రకటనలు చేస్తున్నారని అన్నారు.