
సమాజంలో బంధాలకు విలువ లేకుండాపోతుంది. క్షణికావేశం, చిన్నపాటి వివాదాలు జీవితాలను నాశనం చేస్తున్నాయి. మహారాష్ట్రలో తాజాగా వెలుగులోకి వచ్చిన రెండు వేర్వేరు సంఘటనలు మానవత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. కేవలం చికెన్ కోసం ఒకరు, పాత కక్షలతో మరొకరు సొంత తమ్ముళ్లనే అత్యంత క్రూరంగా హతమార్చారు. అమరావతి జిల్లా భట్కులి తాలూకాలో ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. కేవలం చికెన్ వండుకున్న విషయంలో తలెత్తిన వివాదం 12 ఏళ్ల బాలుడి ప్రాణాలను బలితీసుకుంది. మధ్యప్రదేశ్కు చెందిన ఒక కుటుంబం ఉపాధి కోసం భట్కులికి వలస వచ్చింది. నిందితుడు బబ్బు గౌడ్, మృతుడు జితేరాజ గౌడ్ అన్నదమ్ములు.
ఇంట్లో చికెన్ వండిన సమయంలో భోజనం దగ్గర అన్నదమ్ముల మధ్య చిన్నపాటి వాదన జరిగింది. ఆగ్రహంతో ఊగిపోయిన బబ్బు గౌడ్, ఇంట్లోని ఇనుప రాడ్తో తమ్ముడిపై దాడి చేశాడు. తీవ్ర గాయాలవడంతో చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. కొడుకు చనిపోయాడన్న బాధ కంటే నేరం బయటపడుతుందన్న భయంతో తండ్రి ఈ హత్యను ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. పోలీసులకు తప్పుడు ఫిర్యాదు ఇచ్చాడు. బాలుడి శరీరంపై గాయాలను చూసి అనుమానం వచ్చిన పోలీసులు, తమదైన శైలిలో విచారించడంతో అసలు నిజం బయటపడింది. నిందితుడు బబ్బు గౌడ్తో పాటు నిజాన్ని దాచిపెట్టిన తండ్రిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.
బుల్ధానా జిల్లాలో మరో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఒక వ్యక్తి తన స్నేహితుడితో కలిసి సొంత తమ్ముడిని చంపి, ఆధారాలు దొరకకుండా శవాన్ని తగులబెట్టాడు. ఫిబ్రవరి 25న ఖమ్గావ్ ప్రాంతానికి చెందిన రోషన్ సంజయ్ ఇంగ్లే, తన తమ్ముడు చేతన్ ఇంగ్లేను పక్కా ప్లాన్తో హతమార్చాడు. హత్య చేసిన అనంతరం నిందితులు మృతదేహానికి నిప్పంటించారు. ఆ తర్వాత మిగిలిన బూడిద, ఎముకలను నదిలో పారబోసి ఏమీ తెలియనట్టు నటించారు. చేతన్ కనిపించడం లేదన్న ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పింపాల్గావ్ రాజా పోలీసులు విచారణ చేపట్టగా అన్నే హంతకుడని తేలింది. ప్రస్తుతం నిందితులిద్దరినీ అరెస్ట్ చేసి, హత్యకు గల అసలు కారణాలను పోలీసులు ఆరా తీస్తున్నారు.