
కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా దేశంలో తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టును చేపడుతోన్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టులో భాగంగా అహ్మదాబాద్ నుంచి ముంబయికి తొలి బుల్లెట్ రైలు పరుగులు పెట్టనుంది. ఇందులో భాగంగానే ఈ బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు.
బుల్లెట్ రైలు ప్రాజెక్టులో భాగంగా తొలి బుల్లెట్ రైలు కోసం నిర్మించిన స్టేషన్ వీడియోను కేంద్ర మంత్రి షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సబర్మతి మల్టీమోడల్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ హబ్లో ఈ స్టేషన్ను నిర్మించారు. దేశంలోనే తొలిసారి చేపట్టిన హైస్పీడ్ రైల్ కారిడార్ నిర్మాణంలో భాగంగా ఈ స్టేషన్ నిర్మాణం చేపట్టారు. అత్యాధునిక సదుపాయాలతో ఈ స్టేషన్ను నిర్మించినట్లు స్పష్టమవుతోంది.
బుల్లెట్ ట్రైన్ స్టేషన్ను జంట భవనాలుగా రూపొందించారు. స్టేషన్కు అవతల గోడలపై ఉప్పు సత్యాగ్రహం సన్నివేశాలకు సంబంధించిన భారీ చిత్రాలను ఏర్పాటు చేశారు. ఈ స్టేషన్ను మొత్తం 1,33,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించారు. ఈ రైల్వే స్టేషన్లో ఆఫీస్లు, వాణిజ్య కార్యాలయాలు, రిటైల్ స్టోర్లు ఏర్పాటు చేసుకొనే విధంగా నిర్మించారు.
Terminal for India’s first bullet train!
📍Sabarmati multimodal transport hub, Ahmedabad pic.twitter.com/HGeoBETz9x
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) December 7, 2023
ఇదిలా ఉంటే ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ పూర్తయితే.. ముంబయి-అహ్మదాబాద్ మధ్య ప్రయాణం 2 గంటల్లోనే పూర్తవుతుంది. ఈ రైలు గరిష్టంగా గంటలకు 350 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది. ఇక ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్కు సంబంధించి ప్రధాని మోదీ, అప్పటి జపాన్ పీఎం షింజో అబేల మధ్య 2017లో ఒప్పందం కుదిరింది. ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ కోసం రూ. 1.08 లక్షల కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ మొత్తం ప్రాజెక్టును 2027 నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..