CBI Case on Rolls Royce: రోల్స్ రాయిస్‌పై సీబీఐ కేసు.. ఎయిర్‌క్రాఫ్ట్‌ల కొనుగోళ్లలో అవినీతి ఆరోపణలు

|

May 30, 2023 | 8:36 AM

దేశంలో అక్రమాలకు పాల్పడే విదేశీ సంస్థలపై భారత దర్యాప్తు సంస్థలు కొరడా ఝులిపిస్తున్నాయి. ప్రముఖ విదేశీ రక్షణా ఉత్పత్తుల తయారీ సంస్థ ఏరోస్పేస్‌, డిఫెన్స్‌ కంపెనీ రోల్స్‌ రాయిస్‌ సంస్థ (యూకే)పై సీబీఐ సోమవారం (మే 29) కేసు..

CBI Case on Rolls Royce: రోల్స్ రాయిస్‌పై సీబీఐ కేసు.. ఎయిర్‌క్రాఫ్ట్‌ల కొనుగోళ్లలో అవినీతి ఆరోపణలు
Rolls Royce CBI Case
Follow us on

దేశంలో అక్రమాలకు పాల్పడే విదేశీ సంస్థలపై భారత దర్యాప్తు సంస్థలు కొరడా ఝులిపిస్తున్నాయి. ప్రముఖ విదేశీ రక్షణా ఉత్పత్తుల తయారీ సంస్థ ఏరోస్పేస్‌, డిఫెన్స్‌ కంపెనీ రోల్స్‌ రాయిస్‌ సంస్థ (యూకే)పై సీబీఐ సోమవారం (మే 29) కేసు నమోదు చేసింది. ఎయిర్‌క్రాఫ్ట్‌ల కొనుగోళ్లలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో సీబీఐ కేసు నమోదు చేసినట్లు వెల్లడించింది. భారత నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ కోసం హాక్‌ 115 అడ్వాన్స్‌ జెట్‌ ట్రైనర్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ల కొనుగోళ్ల కాంట్రాక్ట్‌ దక్కించుకునేందుకు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తోంది. అందుకు రోల్స్‌ రాయిస్‌ లంచం ఇచ్చిందని సీబీఐ ఆరోపించింది. రోల్స్‌ రాయిస్‌ ఇండియా డైరెక్టర్‌ టిమ్‌ జోన్స్‌తో పాటు మధ్యవర్తులైన సుధీర్‌ చౌధరి, అతని కుమారుడు భాను ఛౌదరి, రోల్స్‌ రాయిస్‌ పీఎల్‌సీ, బ్రిటిష్‌ ఏరోస్పేస్‌ సిస్టమ్స్‌పై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.

కాగా 24 హాక్‌ 115 ఏజీటీల కొనుగోళ్లకు రోల్స్‌ రాయిస్‌తో 2003 సెప్టెంబర్‌లో భారత్​ఒప్పందం కుదుర్చుకుంది. దాదాపు 734.21 మిలియన్‌ బ్రిటిష్‌ పౌండ్లతో కొనుగోలు చేసేందుకు అంగీకరించింది. అలాగే, 42 ఎయిర్‌ క్రాఫ్ట్‌ల తయారీకి, హిందుస్థాన్‌ ఎరో నాటిక్స్‌కు మెటీరియల్‌ సప్లయ్‌ చేసేందుకు 308.247 మిలియన్‌ డాలర్లు, లైసెన్స్‌ ఫీజు కింద మరో 7.5 మిలియన్‌ డాలర్లు చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు ఆ తర్వాత 2004 మార్చి 19న యూకే, భారత్‌ల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. అయితే ఈ డీల్‌ పూర్తి చేసేందుకుగానూ పలువురు ప్రభుత్వ అధికారులకు రోల్స్‌ రాయిస్‌ భారీ మొత్తంలో లంచం ఇచ్చినట్లు కేంద్ర దర్యాప్తు సంస్థ ఆరోపించింది. అవినీతి ఆరోపణల కారణంగా ఈ ఒప్పందం నిలిచిపోయింది.

2006-07 మధ్య రోల్స్‌ రాయిస్‌ ఇండియా కార్యాలయాలపై ఐటీ శాఖ సోదాలు నిర్వహించింది. ఈ సమయంలో కీలక పత్రాలు బయటపడ్డాయి. ఐతే వాటిని ధ్వంసం చేసినట్లు సీబీఐ ఆరోపిస్తోంది. ఆ తర్వాత 2016లో దీనిపై సీబీఐ దర్యాప్తు ప్రారంభించగా.. ఆరేళ్ల తర్వాత ఎయిర్‌క్రాఫ్ట్‌ల కొనుగోళ్లకు సంబంధించి భారత ప్రభుత్వాన్ని మోసగించారన్న ఆరోపణలపై రోల్స్‌ రాయిస్‌ కంపెనీపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ సంస్థ ప్రతినిధులతో పాటు ఇద్దరు మధ్యవర్తులనూ నిందితులుగా సీబీఐ తేల్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.