
బీహార్లో అత్యంత దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. జెహానాబాద్ జిల్లా పార్స్ బిఘా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇమాద్పూర్ గ్రామంలో ఓ వ్యక్తి తన వదినను గొడ్డలితో హత్య చేసి, అనంతరం ఆమె తలను నరికి ఇంటి ముందున్న చెట్టుకు వేలాడదీశాడు. ఈ అమానుష ఘటన స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది.
మృతురాలిని ధర్మేంద్ర కుమార్ భార్య, 25 ఏళ్ల అన్షు దేవిగా పోలీసులు గుర్తించారు. గ్రామస్థుల కథనం ప్రకారం, నిందితుడు కునాల్ కుమార్ మాదకద్రవ్యాలకు బానిస. ఘటన జరిగిన సమయంలో కుటుంబ సభ్యులు పొలాలకు వెళ్లగా, అన్షు దేవి ఇంట్లో ఒంటరిగా ఉంది. అదే సమయంలో ఇంటికి వచ్చిన కునాల్ కుమార్ భోజనం అడిగాడు. భోజనం పెట్టడంలో కొంత ఆలస్యం కావడంతో ఆగ్రహానికి గురైన అతడు గొడ్డలితో ఆమెపై విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేశాడు. అనంతరం తలను నరికి ఇంటి ముందున్న చెట్టుకు వేలాడదీశాడు.
నేరం చేసిన తర్వాత కూడా నిందితుడు పరారయ్యే ప్రయత్నం చేయకుండా ఇంటి సమీపంలోనే కూర్చొని ఉన్నట్లు గ్రామస్థులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ దారుణ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకోగా, నిందితుడి మానసిక పరిస్థితి, మాదకద్రవ్యాల వినియోగం ఘటనకు కారణమా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..