
బెంగళూరులోని ఓ ఫైవ్స్టార్ హోటల్లో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. 10, 5 ఏళ్ల వయసున్న ఇద్దరు చిన్నారులు హోటల్ గదిలో మృతిచెందగా.. వారి తండ్రి తీవ్ర గాయాలతో టాయిలెట్లో కనిపించాడు. ఈ ఘటనను పోలీసులు హత్య, ఆత్మహత్య కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. నాగవార ప్రాంతానికి చెందిన 40 ఏళ్ల ఇమ్రాన్ తన ఇద్దరు కుమార్తెలతో కలిసి సోమవారం సాయంత్రం హోటల్లో చెక్ఇన్ అయ్యాడు. మంగళవారం సాయంత్రం సుమారు 4 గంటల సమయంలో హోటల్ క్లీనింగ్ సిబ్బంది గదికి వెళ్లి తలుపు తట్టారు. లోపల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో తలుపు తెరిచి చూడగా షాకింగ్ దృశ్యం కనిపించింది.
గదిలోని మంచంపై 10, 5 ఏళ్ల ఇద్దరు బాలికలు విగతజీవులుగా కనిపించారు. అదే సమయంలో టాయిలెట్లో ఇమ్రాన్ తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో పడి ఉన్నాడు. అతడు తన గొంతును కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. వెంటనే హోటల్ భద్రతా సిబ్బంది అతడిని మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ప్రాథమిక దర్యాప్తులో ఇమ్రాన్కు తన భార్యపై అనుమానాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆమెకు వివాహేతర సంబంధం ఉందని అతడు అనుమానించినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఈ కారణంతోనే తన కుమార్తెలను, తనను తాను చంపుకోవాలని నిర్ణయించుకున్నట్లు అతడు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. ఇమ్రాన్ తన ఇద్దరు కుమార్తెలను గొంతు నులిమి చంపిన అనంతరం తాను గొంతు కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇమ్రాన్ తన కుమార్తెలను తానే చంపినట్లు అంగీకరించినట్లు డీసీపీ జీకే మిథున్ కుమార్ తెలిపారు.
ఈ ఘటనపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. ఇమ్రాన్ వృత్తి ఏమిటి, కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయి, భార్యపై అతడికి ఉన్న అనుమానాల వెనుక వాస్తవాలు ఏమిటి, ఘటనకు అసలు కారణం ఏంటనే విషయాలను తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కుటుంబ సభ్యులను విచారించిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.