CM Mamata Banerjee: యూనివర్సిటీలకు ఛాన్సలర్గా ముఖ్యమంత్రి.. మమతా బెనర్జీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం..
ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం దిశగా సాగుతోంది. మమతా అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని విశ్వవిద్యాలయాలకు ఛాన్సలర్గా ఇక నుంచి ముఖ్యమంత్రి వ్యవహరించేలా త్వరలోనే బిల్లు తీసుకురావాలని..
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(CM Mamata Banerjee) ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం దిశగా సాగుతోంది. మమతా అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని విశ్వవిద్యాలయాలకు ఛాన్సలర్గా ఇక నుంచి ముఖ్యమంత్రి వ్యవహరించేలా త్వరలోనే బిల్లు తీసుకురావాలని నిర్ణయించింది. ఈ మేరకు గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో వచ్చిన ఈ ప్రతిపాదనకు మంత్రులు అంగీకారం తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలకు ఛాన్సలర్గా గవర్నర్ వ్యవహరిస్తుండగా.. బెంగాల్లో ఆ హోదాను సీఎంకు మార్చాలన్న ప్రతిపాదనకు ఆమోద ముద్ర పడిందని.. దీనికి సంబంధించిన బిల్లు త్వరలోనే అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నట్టు బెంగాల్ విద్యాశాఖ మంత్రి బ్రాత్య బసు వెల్లడించారు. ఈ ప్రతిపాదనపై త్వరలోనే అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టబోతున్నట్లుగా మంత్రి వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు గవర్నర్ ఛాన్స్లర్గా ఉంటున్నారు. ఈ బిల్లుకు అసెంబ్లీతో పాటు గవర్నర్ ఆమోదం లభిస్తే.. అమలులోకి వస్తుంది. ఆ తర్వాత యూనివర్సిటీలకు ఛాన్స్లర్గా ముఖ్యమంత్రి వ్యవహరిస్తారు. దీంతో యూనివర్సిటీలపై గవర్నర్ తన అధికారం కోల్పోనున్నారు.
పశ్చిమబెంగాల్ కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయం మరోసారి దీదీ, గవర్నర్ మధ్య మరోసారి యుద్ధానికి దారి తీసే అవకాశం కనిపిస్తోంది. ఈ ఏడాది జనవరిలో రాష్ట్ర ప్రభుత్వం తన సమ్మతి లేకుండా 25 రాష్ట్ర యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్లను నియమించిందని గవర్నర్ ఆరోపించడం వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే. అయితే, దీనిపై ప్రభుత్వం స్పందిస్తూ.. సెర్చ్ కమిటీ ఎంపిక చేసిన వైస్ ఛాన్సలర్ల పేర్లను గవర్నర్ ఆమోదించించాల్సి ఉంటుందని.. కానీ ఆయన నిరాకరించినట్లయితే విద్యాశాఖ తన సొంత నిర్ణయంతో ముందుకెళ్లే అధికారం కలిగి ఉందని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే అన్ని విశ్వవిద్యాలయాలకు గవర్నర్ ఎక్స్ అఫిషియో ఛాన్సలర్గా ఉండాలన్నది వలసవాద వారసత్వమని, దీన్ని సమీక్షించి.. ఆ స్థానాల్లో స్కాలర్లను నియమించాలని అప్పట్లో ప్రభుత్వం ప్రకటించడం సంచలనంగా మారింది.
బెంగాల్ రాష్ట్రంలోని 17 విశ్వవిద్యాలయాలకు గవర్నర్ ఛాన్సలర్గా వ్యవహరిస్తున్నారు. వీటిలో యూనివర్సిటీ ఆఫ్ కలకత్తా, జాదవ్పూర్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ కల్యాణి, రవీంద్ర భారతి యూనివర్సిటీ, విద్యాసాగర్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ బుర్ద్వాన్, నార్త్ బెంగాల్ యూనివర్సిటీ వంటివి ఉన్నాయి. అయితే.. శాంతినికేతన్లోని విశ్వభారతికి గవర్నర్ రెక్టార్గా ఉండగా.. ప్రధాని నరేంద్ర మోదీ ఛాన్సలర్గా కొనసాగుతున్నారు.