ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం మహా విషాదాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ రైలు ప్రమాదంలో ఇప్పటివరకు 288 మంది దుర్మరణం చెందగా.. 1100 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. కోరమాండల్ ఎక్స్ప్రెస్, యశ్వంత్పూర్- హావ్డా ఎక్స్ప్రెస్ రైళ్ల శిథిలాలను వేగవంతంగా తొలగించి.. రైళ్ల రాకపోకల కోసం ట్రాక్ ను నిర్మిస్తున్నారు. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని విపక్ష పార్టీలు చేస్తున్న విమర్శలు రాజకీయంగా కలకలం రేపాయి. బాలేశ్వర్ జిల్లాలో జరిగిన రైలు ప్రమాదానికి బాధ్యత వహిస్తూ.. అశ్వినీ వైష్ణవ్ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. గతంలో రైలు ప్రమాదానికి బాధ్యత వహిస్తూ.. అప్పుడు కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్న లాల్ బహుదూర్ శాస్ర్త్రీ రాజీనామా చేశారని గుర్తుచేస్తున్నారు. అంతేకాకుండా.. విపత్కర పరిస్థితుల్లో అండగా ఉండాల్సిన విపక్షాలు.. ఆరోపణలు చేయడం తగదంటూ బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. అసలు ప్రమాదం జరిగిన తీరుపై స్పందించే విధానం ఇదేనా అంటూ కాషాయ పార్టీ నేతలు విపక్షాలకు కౌంటర్ ఇస్తున్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అస్సలు పట్టించుకునే వారే కాదని.. ఇప్పుడు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్.. తదితర మంత్రులు సంఘటన జరిగిన ప్రాంతంలో 24 గంటల పాటు పర్యవేక్షిస్తున్నారని.. నరేంద్ర మోడీ పాలనకు ఇదే నిదర్శనమంటూ బీజేపీ నేతలు పేర్కొంటున్నారు. రైలు ప్రమాదంపై ఆందోళన వ్యక్తంచేసిన కాంగ్రెస్, టీఎంసీ సహా పలు పార్టీల నేతలు పలు ఆరోపణలు చేశారు. అంతేకాకుండా రైల్వే మంత్రి రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో బీజేపీ నాయకులు కౌంటర్ ఇస్తున్నారు.
గతంలో రైల్వే మంత్రుల చర్యలు కేవలం ప్రమాదాల సమయంలో ఫొటోలకే పరిమితం కావడం చూశామని.. రైల్వే మంత్రిగా పనిచేసిన మమతా బెనర్జీ లాంటి వాళ్లు అప్పట్లో చేసిన రాజకీయాలను చాల చూశామని బీజేపీ పేర్కొంటున్నారు. ఇప్పుడు మన రైల్వే మంత్రి గత 30 గంటలుగా ఘటనా స్థలంలోనే ఉండి.. రెస్క్యూలో నిమగ్నమయ్యారు. సహాయక చర్యల్లో అవిశ్రాంతంగా పాల్గొంటున్నారంటూ బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి.
ప్రమాదం భయంకరమైనది అయినప్పటికీ, గతంలోని సైలో విధానం వలె కాకుండా అన్ని ఏజెన్సీలు కలిసి పని చేస్తున్న తీరు.. అందరినీ ఆకట్టుకుంటోంది. రైల్వే, ఎంహెచ్ఏ, ఎన్డిఆర్ఎఫ్ అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారు. ఆరోగ్య మంత్రి కూడా ఘటనా స్థలంలోనే ఉన్నారు. నష్టాన్ని తగ్గించడానికి మంచి వైద్యం అందించడానికి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు.
ప్రమాదం , కవాచ్ కారణాల గురించి ప్రతిపక్షం నిన్న ప్రచారంలో నిమగ్నమై ఉండగా, ప్రభుత్వం మాత్రం అవన్నీ పట్టించుకోకుండా చురుకుగా.. పారదర్శకంగా పనిచేసింది. ప్రభుత్వం ప్రమాదం గురించి పూర్తి వివరాలను పంచుకోవడమే కాకుండా, ప్రాణనష్టం సంఖ్యను కూడా పారదర్శకంగా ఎప్పటికప్పుడు పంచుకుంటుందంటూ బీజేపీ వర్గాలు వెల్లడించాయి.
#WATCH | Railways Minister Ashwini Vaishnaw and Union Minister Dharmendra Pradhan present at the accident site in Odisha’s #Balasore to look over the ongoing restoration work. pic.twitter.com/RaTbXkwpoM
— ANI (@ANI) June 4, 2023
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..