డర్టీ డ్రాగన్ బుద్ధి మారడం లేదు.. పొరుగు దేశాలతో ఏరికోరి గిల్లికజ్జాలు పెట్టుకోవడం మానడం లేదు. ఇది ఇప్పుడు స్టార్ట్ చేసిందేం కాదు.. దశాబ్దాలుగా చైనా చేస్తున్న కుట్రలివే..! కాకపోతే భారత్తో ఆ పప్పులుడకడం లేదు. అందుకే కయ్యానికి కవ్విస్తూ కుయుక్తుల్ని పన్నుతుంటుంది కంత్రీ కంట్రీ. ఇండియా బోర్డర్లో అలాంటి విష పన్నాగాలు పన్నుతోంది. భారత్ సహనాన్ని పరీక్షిస్తూ.. ఇండియాలోకి చొచ్చుకొచ్చేందుకు కుట్రలు చేస్తోంది చైనా. అటు లడ్డాఖ్, ఇటు అరుణాచల్ ప్రదేశ్లో అక్రమణలకు పాల్పడుతూ దొంగ బుద్దిని చూపిస్తోంది డ్రాగన్.
అరుణాచల్ ప్రదేశ్లోని అంజా జిల్లాలో ఉన్న కపాపు అనే ప్రాంతంలోకి చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ చొరబడినట్టు ఆనవాళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతం ఇండో-చైనా సరిహద్దుకు దాదాపు 60 కిలోమీటర్ల లోపల ఉంది. ఇక్కడ చలిమంటలు వేసుకున్న ఆనవాళ్లు ఉన్నాయి. బండరాళ్లపై స్ప్రే పెయింట్లో చైనా, 2024 అని రాసి ఉంది. చైనాకు సంబంధించిన పలు ముద్రలను కూడా పెయింటింగ్ వేశారు. చైనా ఆహార పదార్థాలు సైతం లభించాయి. వారం పదిరోజుల క్రితం చైనా బలగాలు ఇక్కడ శిబిరాన్ని ఏర్పాటు చేసుకొని ఉండవచ్చని, చైనా సైనికులు కావాలనే పెయింటింగ్లు వేశారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇక లడఖ్లో కూడా సమయం చిక్కినప్పుడల్లా విషాగ్నిని కక్కుతూ తన కుట్రలను బయటపెడుతుంటుంది. లడఖ్ సరిహద్దులో ఉన్న లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్లో చైనా సైన్యం ఆరు కొత్త హెలిస్ట్రిప్లను నిర్మించింది. శాటిలైట్ ఫోటోల ద్వారా ఈ విషయం వెల్లడైంది. హెలిస్ట్రిప్ నిర్మించిన ప్రదేశం పశ్చిమ టిబెట్లో ఉంది. లడఖ్లోని డెమ్చోక్ నుండి ఈ హెలిస్ట్రిప్ల దూరం 100 మైళ్లు మాత్రమే. దీని కారణంగా ప్రమాదం మరింత పెరుగుతుందని రక్షణ వర్గా భావిస్తున్నాయి. తూర్పు లడఖ్లోని పాంగోంగ్ సరస్సు సమీపంలోనూ చైనా సైన్యం తవ్వకాలు జరిపినట్లు వార్తలు వచ్చాయి. చైనా ఇక్కడ ఒక భూగర్భ బంకర్ను నిర్మిస్తోంది.
కేంద్రంలోని మోదీ సర్కార్ తీసుకునే నిర్ణయాలు చైనాకు కంటగింపుగా మారుతున్నాయి. ఆర్థికంగా, రాజకీయంగా, సైనికపరంగా ఇండియా బలపడటం డ్రాగన్కు అస్సలు నచ్చదు. తమను మించిపోతున్నారనే ఇన్ఫియారిటీ ఎప్పుడూ ఆ దేశాన్ని వేధించే అంశం. అందుకే ఎలాగైనా భారత్ను అస్థిర పరిచేందుకు పక్కదారులు వెతకడం, ఏవీ దొరక్కపోతే కవ్వింపు చర్యలకు దిగడం డ్రాగన్కు అలవాటుగా మారింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..