
భారత్ పట్ల పాకిస్థాన్ తన వక్రబుద్ది ఏమాత్రం మార్చుకోవడం లేదు. పాకిస్థాన్ తన ఉగ్రవాదులకు ఊతమిచ్చే కార్యకలాపాలను నిరంతరం కొనసాగిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే పూంచ్-రాజౌరీలో ఉగ్రవాదాన్ని పునరుజ్జీవింపజేసేందుకు పాకిస్థాన్ మరోసారి ప్రయత్నిస్తోంది. ఈ ప్రాంతాల్లో దాదాపు 25-30 మంది పాకిస్థానీ ఉగ్రవాదులు క్రియాశీలకంగా ఉన్నారని రక్షణ వర్గాల సమాచారం. ఈ ఉగ్రవాదులు పూంచ్-రాజౌరీ అడవుల్లో దాగి ఉండి, అవకాశం దొరికినప్పుడల్లా భద్రతా బలగాలను టార్గెట్ చేస్తున్నారు.
గురువారం జమ్మూకశ్మీర్లోని పూంచ్లో రెండు ఆర్మీ వాహనాలపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో నలుగురు జవాన్లు వీరమరణం పొందగా, ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. ఈ దాడికి జైష్తో సంబంధం ఉన్న పీఏఎఫ్ఎఫ్ అనే సంస్థ బాధ్యత వహించింది. ఈ ఏడాది జనవరిలో హోం మంత్రిత్వ శాఖ ఈ సంస్థను నిషేధించింది.
జమ్మూ కాశ్మీర్లోని పీర్పంజాల్లోని కొండ ప్రాంతాల్లో 25-30 మంది ఉగ్రవాదులు క్రియాశీలకంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఉగ్రవాద సంస్థలు PAFF లేదా TRFతో సంబంధం కలిగి ఉన్నాయంటున్నాయి భద్రతా వర్గాలు. ఉగ్రవాద సంస్థలకు స్థానికంగా 75-100 మంది మద్దతుదారులు కూడా ఉన్నారు. వారు జమ్మూ, కుల్గాంలోని పూంచ్, రాజౌరి, రియాసి, కాశ్మీర్లోని షోపియాన్, అనంత్నాగ్ జిల్లాలలో చురుకుగా ఉన్నారు. PAFF లేదా TRF గత కొన్ని సంవత్సరాలలో అనేక తీవ్రవాద సంఘటనలను నిర్వహించింది. ఈ సంస్థలు ‘గెరిల్లా యుద్ధం’ పద్ధతులను ఉపయోగిస్తున్నాయి. చిన్న చిన్న గుంపులుగా భద్రతా దళాలపై రహస్యంగా దాడి చేస్తున్నారు. దాడి చేసిన తరువాత, సురక్షితంగా తిరిగి అడవిలో దాక్కుంటున్నట్లు భద్రతా దళాలు తెలిపాయి. వీరిలో కొందరు ఉగ్రవాదులు పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్లో శిక్షణ కూడా తీసుకున్నట్లు సమాచారం.
జమ్మూ, కశ్మీర్ లోయలో ఉగ్రవాదాన్ని పునరుద్ధరించడం వెనుక చైనా, పాకిస్తాన్ల గేమ్ ప్లాన్లో భాగమై ఉంటుందని భారత రక్షణ రంగ నిపుణులు అనుమానిస్తున్నారు. ఈ దాడుల ద్వారా భారత సైన్యం దృష్టిని జమ్మూ కాశ్మీర్ వైపు మళ్లించాలని, గత మూడేళ్లుగా చైనా, భారత్ల మధ్య వివాదం కొనసాగుతున్న లడఖ్ తదితర ప్రాంతాల్లో మోహరింపును తగ్గించాలని ఇరు దేశాల ప్రయత్నాలు చేస్తున్నాయి. 2020లో చైనా సైన్యాన్ని ఎదుర్కోవడానికి భారతదేశం పూంచ్ సెక్టార్ నుండి లడఖ్కు రాష్ట్రీయ రైఫిల్స్ యూనిఫాం ఫోర్స్ను పంపింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…