
కర్ణాటకలోని బళ్లారిలోని కళ్యాణ్ జ్యువెలర్స్ స్టోర్లో భారీ పేలుడు సంభవించింది. జ్యువెలర్స్లో ఎయిర్ కండీషనర్ పేలడంతో ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలు అయ్యాయి. సిబ్బంది వెంటనే వారికి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వివరాల ప్రకారం.. స్టోర్లోని ఎయిర్ కండిషనర్లో పనిచేయకపోవడం వల్ల పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించిన వీడియోలో స్టోర్ వద్ద చుట్టుపక్కల ఉన్న కిటికీలు పగిలిపోయినట్లు చూపించగా, గాయపడిన వారిని పరిస్థితి విషమంగా ఉన్నట్లు, వారికి చికిత్స నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. స్టోర్లో ఒక్కసారిగా పేలుడు జరగడంతో భారీ మొత్తంలో పొగలు కమ్ముకున్నాయి. కొంత మేర మంటలు కూడా వ్యాపించినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో వారు హుటాహుటిన సంఘటనల స్థలానికి చేరుకుని మంటలు ఆర్పివేశారు.
ఇందుకు సంబంధించిన ఓ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆదిలా ఉండగా, ఎండాకాలంలో అగ్ని ప్రమాదాలు ఎక్కువ సంభవించే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలని ఫైర్ సిబ్బంది సూచిస్తున్నారు. ఏసీలు, విద్యుత్ పరికరాలను ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాలని, షార్ట్ సర్క్యూట్ కారణంగా కూడా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయని, అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు ఫైర్ సిబ్బంది.