
ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం మూడో రోజుకు చేరింది. బాంబులు మోతతో ఇరాన్, ఇజ్రాయెల్ సహా గల్ఫ్ దేశాలు అట్టుడుకుతున్నాయి. ఇరాన్ సుప్రీం కమాండర్ ఖమేని మరణంతో అనేక దేశాల్లో షియాలు అధికంగా ఉండే ప్రాంతాల్లో ఆందోళనలు నిరసనలు జరుగుతున్నాయి. భారత్ లో శ్రీనగర్, లక్నో, హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఇవాళ కూడా పలు ప్రాంతాల్లో నిరసనలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా సైనిక దాడుల నేపథ్యంలో భారతదేశంలో మత హింస చెలరేగకుండా అప్రమత్తంగా ఉండాలని.. కేంద్ర హోంశాఖ రాష్ట్ర ప్రభుత్వాలను సూచనలు చేసింది. విదేశాలలో జరుగుతున్న పరిణామాలు దేశీయంగా ప్రభావితం చూపుతాయని, ముఖ్యంగా మతపరమైన సమావేశాలలో విద్వేష ప్రసంగాలు ఉండే అవకాశం ఉందని వాటిపై దృష్టిసారించాలని రాష్ట్రాలకు సూచించింది.
స్థానికంగా అశాంతిని లేదా మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొట్టే ఇరాన్ అనుకూల రాడికల్ బోధకులు ఇచ్చే రెచ్చగొట్టే ప్రసంగాలను గుర్తించాలని, శాంతిభద్రతలకు భంగం కలగకుండా నివారించడానికి నిఘా సమాచారాన్ని పంచుకోవాలని, ఉద్రిక్త పరిస్థితుల నివారణ చర్యలను తీవ్రతరం చేయాలని రాష్ట్రాలను కోరింది. ఇప్పటికే ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా సంయమనం పాటించాలని భారత్ కోరింది. గల్ఫ్లో నివసిస్తున్న భారత పౌరుల భద్రత కోసం ఎప్పటికప్పుడు అడ్వైజరీలు జారీ చేస్తోంది.. ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాలు దేశంలో తీవ్రవాద శక్తులు స్థానిక ఉద్రిక్తతలను రెచ్చగొట్టడానికి ఉపయోగించుకునే అవకాశం ఉండటంతో అప్రమత్తమైన కేంద్రం దానికి అణుగుణంగా చర్యలు తీసుకుంటుంది.
ఇరాన్ సుప్రీం కమాండర్ హత్యకు నిరసనగా శ్రీనగర్లో బంద్ కొనసాగుతుంది. కాశ్మీర్ ప్రధాన మతాధికారి మిర్వైజ్ ఉమర్ ఫరూక్ పిలుపు మేరకు బంద్ జరుగుతోంది. అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడిలో ఇరాన్ సుప్రీం నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ హత్యకు సంతాపం తెలిపారు షియా ముస్లింలు.. ఖమేనీ హత్య నిరసనల నేపథ్యంలో కాశ్మీర్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు విధించారు అధికారులు.. కాశ్మీర్ అంతటా మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్ తగ్గించారు. శాంతిభద్రతలను కాపాడటానికి ముందు జాగ్రత్త చర్యగా మొబైల్ ఇంటర్నెట్ సేవలపై పరిమితులు విధించారు. కాశ్మీర్లో ఉన్న దాదాపు 15 లక్షల మంది షియాలు ఉన్నారు. నిన్న లాల్ చౌక్, సైదా కదల్, బుడ్గామ్, బండిపోరా, అనంత్నాగ్ పుల్వామాలలో పెద్ద ఎత్తున ఖమేనీ మృతికి సంతాపం గా నిరసనలు జరిగాయి.. ఇవాళ కూడా పలు ప్రాంతాల్లో నిరసనలు జరిగే అవకాశం ఉండటంతో.. వాటిపై దృష్టిపెట్టాలని కేంద్రం రాష్ట్రాలను కోరింది..
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..