Teesta Setalvad: సామాజిక ఉద్యమకారిణి తీస్తా సెతల్వాద్‌ అరెస్టు.. గుజరాత్ అల్లర్ల విషయంలో..

గుజరాత్‌లో 2002లో జరిగిన అల్లర్ల (Gujarat riots) విషయంలో ప్రత్యేక దర్యాప్తు బృందానికి, పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చారన్న ఆరోపణలపై తీస్తా సెతల్వాద్‌తోపాటు రిటైర్డ్‌ డీజీపీ ఆర్బీ శ్రీకుమార్‌, మాజీ ఐపీఎస్‌ అధికారి సంజీవ్‌ భట్‌లపై అహ్మదాబాద్‌లో కేసు నమోదైంది.

Teesta Setalvad: సామాజిక ఉద్యమకారిణి తీస్తా సెతల్వాద్‌ అరెస్టు.. గుజరాత్ అల్లర్ల విషయంలో..
Teesta Setalvad

Updated on: Jun 26, 2022 | 6:11 AM

Activist Teesta Setalvad Arrest: ప్రముఖ సామాజిక ఉద్యమకారిణి తీస్తా సెతల్వాద్‌ ను గుజరాత్‌ యాంటీ టెర్రర్‌ స్క్వాడ్‌ (ATS) శనివారం ముంబైలో అదుపులోకి తీసుకుంది. మొదట ఆమెను శాంతాక్రూజ్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించిన ఏటీఎస్ అధికారులు.. అనంతరం ఆమెను గుజరాత్ అహ్మదాబాద్‌కు తీసుకెళ్లారు. గుజరాత్‌లో 2002లో జరిగిన అల్లర్ల (Gujarat riots) విషయంలో ప్రత్యేక దర్యాప్తు బృందానికి, పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చారన్న ఆరోపణలపై తీస్తా సెతల్వాద్‌తోపాటు రిటైర్డ్‌ డీజీపీ ఆర్బీ శ్రీకుమార్‌, మాజీ ఐపీఎస్‌ అధికారి సంజీవ్‌ భట్‌లపై అహ్మదాబాద్‌లో కేసు నమోదైంది. దీనిలో భాగంగా అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు గుజరాత్‌ క్రైం బ్రాంచ్‌ పోలీసులు.. ఆర్బీ శ్రీకుమార్‌ను గాంధీనగర్‌లో అరెస్టు చేశారు. సంజీవ్‌ భట్‌ ఓ కేసులో ప్రస్తుతం జైల్లో ఉన్నారు. ఎఫ్ఐఆర్ ప్రకారం.. తీస్తా సెతల్వాద్.. అల్లర్లలో చనిపోయిన కాంగ్రెస్‌ ఎంపీ ఇషాన్‌ జఫ్రి భార్య జకియా జాఫ్రీ ద్వారా కోర్టులో అనేక పిటిషన్లు వేసి, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధిపతి, ఇతర కమిషన్లకు తప్పుడు సమాచారం ఇచ్చారని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

కాగా.. 2002 గుజరాత్‌ అల్లర్ల కేసులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహా మరో 64 మందికి క్లీన్‌చిట్‌ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసిన మరుసటి రోజే తీస్తా సెతల్వాద్‌ను అరెస్టు చేయడం చర్చనీయాంశంగా మారింది. అల్లర్ల పిటిషన్‌ దాఖలు చేసినవారిలో తీస్తా సెతల్వాద్‌ ఒకరు. అయితే.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ఆదేశాలతోనే ఏటిఎస్‌ పోలీసులు ఆమెను అరెస్టు చేసినట్లు కథనాలు వెలువడ్డాయి. అంతకుముందు రోజు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సెతల్వాద్ 2002 గుజరాత్ అల్లర్ల గురించి నిరాధారమైన సమాచారాన్ని పోలీసులకు ఇచ్చారని ఆరోపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతిష్ట దిగజార్చడానికి తీస్తా సెతల్వాద్‌ ప్రయత్నిస్తున్నారంటూ మండిపడ్డారు.

2002 గుజరాత్‌ అల్లర్ల కేసులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి క్లీన్‌చిట్‌ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ ఇషాన్‌ జాఫ్రి భార్య జకియా జాఫ్రి సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్‌కు.. తీస్తా సెతల్వాద్‌కు చెందిన ఎన్‌జిఒ మద్దతుగా నిలిచింది. కాగా సుప్రీంకోర్టు శుక్రవారం.. పీఎం మోడీకి సిట్ ఇచ్చిన క్లీన్ చిట్‌ను సమర్థిస్తూ ఈ పిటిషన్ ను కొట్టివేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..