Uttarakhand Glacier Burst: ఉత్తరాఖండ్ రాష్ట్రం చమోలీ జిల్లాలో ఫిబ్రవరిలో మంచుచరియలు విరిగిపడి వరదలు సంభవించి భారీ నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన మరిచిపోకముందే.. చమోలీ జిల్లాలో మరోసారి మంచుచరియలు విరిగిపడి ఎనిమిది మంది మరణించారు. చాలామందిని జవాన్లు రక్షించారు. భారత్-చైనా సరిహద్దుల్లోని చమోలీ జిల్లా నీతి వ్యాలీలోని సుమ్నా గ్రామంలో శుక్రవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇప్పటివరకు 8 మంది మృతిచెందారు. మరో ఆరుగురి పరస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు.
అధిక ఉష్ణోగ్రతల కారణంగా మంచు కరిగి.. మంచు చరియలు విరిగిపడి ఉండవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. ఘటన జరిగిన వెంటనే చమోలీ జిల్లా అధికార యంత్రాంగం, ఆర్మీ అధికారులు, బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ అధికారులు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. హిమపాతంలో చిక్కుకున్న 384 మందిని బలగాలు రక్షించాయని అధికారులు తెలిపారు. ఆయా ప్రాంతంలోనున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు వెల్లడించారు.
సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని, రెస్క్యూ ఆపరేషన్ పూర్తి కావడానికి మరి కొంత సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మంచుచరియలు రోడ్డుపై పడి ఉండటంతో రెస్క్యూకి అంతరాయం కలుగుతోందని తెలిపారు. ఇదిలాఉంటే.. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ ముంచుచరియలు విరిగిపడిన ప్రాంతంలో ఏరియల్ సర్వే నిర్వహించారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
Also Read: