Independence day: 79వ స్వాతంత్ర దినోత్సవాలకు ముస్తాబైన ఢిల్లీలోని ఎర్రకోట..!
79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు యావత్ భారతావని సిద్ధమైంది.. దేశంలో మొదటగా జెండా ఎగిరే ఎర్రకోట సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఎర్రకోటపై 12వ సారి భారత ప్రధాన మంత్రి హోదాలో నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. సుసంపన్న.. సురక్షిత.. సాహసోపేత నవ భారత్ సాకారమే లక్ష్యంగా భారత్ తన 79వ స్వాతంత్య్ర దినోత్సవం జరగనుంది

79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు యావత్ భారతావని సిద్ధమైంది.. దేశంలో మొదటగా జెండా ఎగిరే ఎర్రకోట సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఎర్రకోటపై 12వ సారి భారత ప్రధాన మంత్రి హోదాలో నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. సుసంపన్న.. సురక్షిత.. సాహసోపేత నవ భారత్ సాకారమే లక్ష్యంగా భారత్ తన 79వ స్వాతంత్య్ర దినోత్సవం జరగనుంది. ఎర్ర కోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, దేశ ప్రజలనుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగిస్తారు. వికసిత భారత్-2047 స్వప్న సాకారంపై ప్రభుత్వ దృక్కోణానికి అనుగుణంగా దేశం వేగంగా ముందంజ వేస్తున్న నేపథ్యంలో ‘నవ భారత్’ ఇతివృత్తంగా ఈ ఏడాది స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. నవ భారత్ నిరంతర వృద్ధిని గుర్తుచేసుకుంటూ పురోగమన పథంలో దేశం మరింత వేగం పుంజుకోగలిగేలా ప్రజలు ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించాలో ప్రధాని మోదీ జాతి నుద్దేశించి ప్రసంగించనున్నారు.
గ్రాండ్ గా సెలబ్రేషన్స్
దేశ రాజధాని ఢిల్లీ ఎర్ర కోటలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు 25 వేల మంది సందర్శకులు హాజరవుతారని అంచనా. ఇందుకోసం భారీగా ఏర్పాట్లు చేశారు. అధునాతన సిటింగ్ వ్యవస్థ, భారీ LED స్క్రీన్లు,స్పీకర్లు ఏర్పాటు చేశారు. ఎర్ర కోట వేదికపై 268 ప్రముఖులకు సిటింగ్ ఏర్పాటు చేశారు. వర్ష పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని జెండా ఎగుర వేసి ప్రసంగించే చోట వర్షం పడకుండా రెయిన్ కవర్ ఏర్పాటు చేశారు. వేదిక ముందు నవ భారత్ కూర్పుతో విద్యార్దులు, NCC కేడేట్లు కూర్చోనున్నారు. ఆపరేషన్ సిందూర్ విజయవంతం నేపథ్యంలో ఆపరేషన్ సిందూర్ హైలెట్ అయ్యేలా నేషన్ ఫస్ట్ బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఎర్రకోట వద్ద జరిగే వేడుకలను వీక్షించడానికి వివిధ రంగాల నుండి సుమారు 5,000 మంది ప్రత్యేక అతిథులను ఆహ్వానించారు. భారత సైన్యం, నావికాదళం, వైమానిక దళం నుండి దాదాపు 2,500 మంది, బాలబాలిక క్యాడెట్లు ‘మై భారత్’ వాలంటీర్లు ఈ వేడుకల్లో పాల్గొంటారు.
భారీ భద్రత ఏర్పాట్లు
స్వాతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో ఢిల్లీలో హై అలర్ట్ కొనసాగుతుంది. స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఢిల్లీ పోలీసులు, పారామిలిటరీ బలగాలు, ప్రత్యేక కమాండోల సహా 15 వేల మంది భద్రత విధుల్లో ఉన్నాయి. ఒక్క నార్త్ ఢిల్లీ పరిధిలో 7,500 పోలీసులు భద్రతా విధుల్లో ఉండనున్నారు. ఎర్రకోటకు మూడు కిలో మీటర్ల పరిధిని భద్రతా దళాలు తమ అధీనంలోకి తీసుకున్నారు. మూడంచెల భద్రత వ్యవస్థను దాటుకుని సందర్శకులు లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. ఎస్పీజీ, ప్రధాని భద్రత, ఢిల్లీ పోలీసులు ఎర్ర కోట లోపల భద్రతను ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. 500 పైగా కెమెరాలు ఎర్ర కోటలోపల ఏర్పాటు చేశారు. మూడు కంట్రోల్ రూమ్ లలో ఎప్పటికప్పుడు భద్రతను పర్యవేక్షిస్తారు.. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా 3,000 మందికి పైగా ట్రాఫిక్ పోలీసుల మోహరించారు.
అనుమానితులను గుర్తించేందుకు ఎర్రకోట వద్ద కృత్రిమ మేధస్సు (AI)తో కూడిన 700 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఎంట్రీ పాయింట్ల వద్ద ఫేస్ రికగ్నిషన్ తనిఖీలు చెకింగ్ పూర్తి చేసుకుని సందర్శకులు గ్యాలరీలకు వెళ్లాల్సి ఉంటుంది. ఎర్రకోట నో ఫ్లై జోన్ గా ప్రకటించారు. డ్రోన్ డిటెక్షన్ గ్రిడ్లు ఏర్పాటు చేశారు. ఎర్రకోట చుట్టూ ఉన్న ఎత్తైన నిర్మాణాల పై స్నిపర్లు, కైట్ క్యాచర్లు, నిఘా పర్యవేక్షణ బృందాలను ఏర్పాటు చేశారు. ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, రైల్వే స్టేషన్, బస్ టెర్మినల్స్, మెట్రో స్టేషన్లు, షాపింగ్ కేంద్రాలు, మార్కెట్ ప్రాంతాలు, పర్యాటక ప్రాంతాల్లో భద్రత పెంచారు.
ఎర్రకోటలో వేడుకలు ఇలా !
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోట వద్దకు చేరుకోగానే రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, సహాయ మంత్రి సంజయ్ సేథ్, కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ స్వాగతిస్తారు. అటుపైన జనరల్ ఆఫీసర్ కమాండింగ్ (జీవోసీ), ఢిల్లీ ఏరియా లెఫ్టినెంట్ జనరల్ భవనీష్ కుమార్ను రక్షణ కార్యదర్శి ప్రధానమంత్రికి పరిచయం చేస్తారు. అనంతరం ఆయన నరేంద్ర మోదీని గౌరవ వందన స్వీకార వేదిక వద్దకు తీసుకెళ్తారు. ఆ తర్వాత ఇంటర్-సర్వీసెస్ సంయుక్త దళం, ఢిల్లీ పోలీస్ గార్డులు ప్రధానమంత్రికి వందనం చేస్తారు. ఈ లాంఛనం ముగిశాక ప్రధానమంత్రి గౌరవ వందనం (గార్డ్ ఆఫ్ ఆనర్) స్వీకరిస్తారు.
ఈ బృందంలో 96 మంది సైనిక, నావిక, వైమానిక దళాలు సహా ఢిల్లీ పోలీసు విభాగం నుంచి ఒక్కొక్క అధికారి సహా మొత్తం 24 మంది సభ్యులుగా ఉంటారు. ఈ సంవత్సరం స్వాతంత్య్ర దినోత్సవానికి వైమానిక దళం సమన్వయ సేవ బాధ్యతలు నిర్వర్తిస్తోంది. గార్డ్ ఆఫ్ ఆనర్ కు వింగ్ కమాండర్ ఎ.ఎస్. సెఖోన్ నాయకత్వం వహిస్తారు. ఈ బృందంలోని సైనిక సిబ్బందికి మేజర్ అర్జున్ సింగ్, నావికా సిబ్బందికి లెఫ్టినెంట్ కమాండర్ కోమల్ దీప్ సింగ్, వైమానిక దళ సిబ్బందికి స్క్వాడ్రన్ లీడర్ రాజన్ అరోరా, ఢిల్లీ పోలీసు సిబ్బందికి అదనపు డీసీపీ రోహిత్ రాజ్బీర్ సింగ్ నాయకత్వం వహిస్తారు. అనంతరం ప్రధానమంత్రి ఎర్రకోట బురుజుల పైకి చేరుకుంటారు. అక్కడ ఆయనకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, సహాయ మంత్రి సంజయ్ సేథ్, రక్షణ సిబ్బంది అధిపతి (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్, సైనిక సిబ్బంది అధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది, నావికా సిబ్బంది అధిపతి చీఫ్ అడ్మిరల్ దినేష్ కె. త్రిపాఠీ, వైమానిక సిబ్బంది అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఎ.పి.సింగ్ స్వాగతం పలుకుతారు. ఆ తర్వాత జాతీయ పతాకావిష్కరణ కోసం ప్రధానమంత్రిని ఢిల్లీ ఏరియా ‘జీవోసీ’ జెండా వేదిక వద్దకు తీసుకెళ్తారు.
ఫ్లయింగ్ ఆఫీసర్ రషికా శర్మ జాతీయ పతాకాన్ని ఎగురవేయడంలో ప్రధానమంత్రికి సహకరిస్తారు. అదే సమయంలో పరాక్రమవంతులైన 1,721 ఫీల్డ్ బ్యాటరీ (సెరిమోనియల్) గన్నర్లు 21 తుపాకులు పేల్చడం ద్వారా గన్ సెల్యూట్ చేస్తారు. స్వదేశీ తయారీ 105 ఎం.ఎం. లైట్ ఫీల్డ్ గన్లను ఉపయోగించే ఈ ఉత్సవ సైనిక బృందానికి మేజర్ పవన్ సింగ్ షెఖావత్ మార్గదర్శకత్వం వహిస్తారు. నాయబ్ సుబేదార్ (గన్నరీలో అసిస్టెంట్ ఇన్స్ట్రక్టర్) అనుతోష్ సర్కార్ గన్ పొజిషన్ ఆఫీసర్గా వ్యవహరిస్తారు. ప్రధానమంత్రి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించే సమయంలో జాతీయ జెండా గార్డ్ బృందంలోని 128 మంది సైనిక, నావిక, వైమానిక దళాలు సహా ఢిల్లీ పోలీసు విభాగం నుంచి ఒక్కొక్క అధికారి సహా 32 మంది సిబ్బంది త్రివర్ణ పతాకానికి వందనం సమర్పిస్తారు. ఈ ఇంటర్-సర్వీసెస్, పోలీస్ సంయుక్త గౌరవ వందనానికి వింగ్ కమాండర్ తరుణ్ డాగర్ నాయకత్వం వహిస్తారు.
జాతీయ పతాక గౌరవ వందన బృందంలోని సైనిక సిబ్బందికి మేజర్ ప్రకాష్ సింగ్, నావికా సిబ్బందికి లెఫ్టినెంట్ కమాండర్ మొహద్ పర్వేజ్, వైమానిక సిబ్బందికి స్క్వాడ్రన్ లీడర్ వి.వి.శర్వణ్, ఢిల్లీ పోలీసు సిబ్బందికి అదనపు డీసీపీ శ్రీ అభిమన్యు పోస్వాల్ నాయకత్వం వహిస్తారు. త్రివర్ణ పతాక ఆవిష్కరణానంతరం జెండాకు జాతీయ గౌరవ వందనం సమర్పిస్తారు. ఈ సందర్భంగా ఒక జేసీవో, 25 మంది ఇతర ర్యాంకుల సిబ్బంది సహిత వైమానిక దళ బ్యాండ్ వాద్య పరికరాలపై జాతీయ గీతాన్ని వాయిస్తుంది. జూనియర్ వారెంట్ ఆఫీసర్ ఎం.డేకా ఈ బ్యాండ్కు మార్గదర్శకత్వం వహిస్తారు. ఈ ఏడాది వేడుకలలో తొలిసారిగా 11 మంది వైమానిక దళ అగ్నివీర్ వాద్యకారులు కూడా ఈ బృందంలో సభ్యులుగా ఉన్నారు. ప్రధానమంత్రి జాతీయ జెండాను ఎగురవేయగానే వైమానిక దళంలోని రెండు ఎంఐ-17 హెలికాప్టర్లు వేదికపై పుష్ప వర్షం కురిపిస్తాయి. వీటిలో ఒకటి జాతీయ పతాకాన్ని, మరొకటి ‘ఆపరేషన్ సిందూర్’ను స్ఫురింపజేసే జెండాను ప్రదర్శిస్తాయి. ఈ హెలికాప్టర్లకు వింగ్ కమాండర్లు వినయ్ పూనియా, ఆదిత్య జైస్వాల్ కెప్టెన్లుగా ఉంటారు.
ఆపరేషన్ సిందూర్
ఈసారి స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా ఆపరేషన్ సిందూర్ విజయోత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా జ్ఞానపథ్లోని వ్యూ కట్టర్ (బారికేడ్)పై ఆపరేషన్ సిందూర్ ను గుర్తుచేసే పుష్పాలంకరణతో లోగోను ప్రదర్శిస్తున్నారు. వేడుకల ఆహ్వాన పత్రాలపైనా ఆపరేషన్ సిందూర్ లోగోను ముద్రించారు. దాంతోపాటు ‘నవ భారత్’ను సూచిస్తూ చీనాబ్ వంతెన వాటర్ మార్క్ ఏర్పాటు చేశారు
జ్ఞానపథ్లో ‘నవ భారత్’ స్వరూపావిష్కరణ
జాతీయ పతాకావిష్కరణ సమయంలో పుష్ప వర్షం అనంతరం ప్రధానమంత్రి ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. ఆయన ప్రసంగం ముగిశాక సైనిక, నావిక, వైమానిక దళాల స్త్రీ-పురుష నేషనల్ కేడెట్ కోర్ (ఎన్సీసీ) కేడెట్లు, ‘మై భారత్’ వాలంటీర్లు జాతీయ గీతం ఆలపిస్తారు. ఈ రెండు విభాగాల నుంచి 2,500 మంది స్వాతంత్య్ర వేడుకలలో పాల్గొంటున్నారు. వీరంతా జ్ఞానపథ్లో ప్రాకారానికి ఎదురుగా ‘నవ భారత్’ లోగో ఆకారంలో కూర్చుని ఆ స్వరూపాన్ని కళ్లకు కట్టేలా చేస్తారు.
ప్రత్యేక అతిథులు
ఈ సంవత్సరం స్వాతంత్య్ర వేడుకలను వీక్షించడం కోసం వివిధ రంగాల నుంచి 5,000 మందికి ప్రత్యేక అతిథులుగా ఆహ్వానాలు అందాయి. మహిళలు పిల్లల సాధికారతకు కోసం కృషి చేస్తున్న 171 మంది ప్రత్యేక అతిథులు ఈ వేడుకకు హాజరవుతారు. ఆహ్వానితులలో అంగన్వాడీ కార్యకర్తలు, సూపర్వైజర్లు, CCIS , PM CARES నుండి పిల్లలు, చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్లు (CDPOలు), జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్లు (DCPOలు), వన్ స్టాప్ సెంటర్ల (OSCలు) సిబ్బంది, రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల నుండి మహిళా శిశు అభివృద్ధి శాఖకు చెందిన అధికారులు హాజరవుతారు. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఆయా ప్రాంతాల సంప్రదాయ వస్త్రధారణతో వచ్చి ఈ మహోత్సవం తిలకించేందుకు 1,500 మందికిపైగా ప్రజలకు ఆహ్వానం అందింది.
ప్రజలకు ప్రత్యేక సదుపాయాలు
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా తొలిసారి 12 ప్రదేశాల్లో 25 క్లోక్ రూమ్లు ఏర్పాటు చేశారు. మొత్తం 190 మంది వలంటీర్లతోపాటు (‘మై భారత్’ నుంచి 120 మంది, ఎన్సీసీ నుంచి 70) పోలీసు సిబ్బంది కూడా సందర్శకులకు మార్గనిర్దేశం చేస్తారు.. వీల్చైర్ అవసరమైన సందర్శకుల కోసం మెట్రో స్టేషన్లు, పార్కింగ్ ప్రదేశాల్లో ఎన్సీసీ కేడెట్లు అందుబాటులో ఉంటారు. పార్కింగ్ నంబర్ ‘4ఎ’లో 250 అదనపు కార్లు నిలిపే సౌకర్యం కల్పించారు.. ఆగస్టు 15 తెల్లవారుజామున 4 గంటల నుంచి ఢిల్లీలో మెట్రో రైళ్లు నడుస్తాయి. వీటిద్వారా ప్రజలు సులువుగా వేదిక వద్దకు చేరుకోవచ్చు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




