
కర్ణాటకలో విషాద ఘటన చోటుచేసుకుంది. వ్యవసాయ భూమిని పరిశీలించేందుకు కుటుంబంతో కలిసి వెళ్లిన ఓ ఐటీ ప్రొఫెషనల్పై పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన మైసూరులో బుధవారం జరిగింది. మృతుడిని మడికేరి పట్టణానికి చెందిన 43 ఏళ్ల రోషన్ బాలకృష్ణగా గుర్తించారు. రోషన్ గతంలో ఐటీ రంగంలో పనిచేసేవాడు. ఇటీవల ఉద్యోగానికి రాజీనామా చేసి వ్యవసాయ రంగంపై ఆసక్తితో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాడు. తన స్నేహితుడితో కలిసి ఆధునిక వ్యవసాయ పరికరాల మార్కెటింగ్ చేస్తూ రైతులతో పనిచేస్తున్నాడు.
వ్యవసాయ కార్యకలాపాలను విస్తరించేందుకు మైసూరులోని ఓ భూమిని పరిశీలించడానికి కుటుంబంతో కలిసి వెళ్లిన రోషన్ అక్కడ ఉన్న మామిడి చెట్టు వద్ద ఆగాడు. మామిడి పండ్లు కోస్తున్న సమయంలో అకస్మాత్తుగా పిడుగు పడటంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన సమయంలో రోషన్ భార్య, కుమారుడు కూడా అక్కడే ఉన్నారు. పిడుగు ప్రభావంతో మరో వ్యక్తి కూడా గాయపడినప్పటికీ అతని పరిస్థితి ప్రమాదకరంగా లేదని సమాచారం. ఘటన అనంతరం మైసూరు జిల్లా విపత్తు నిర్వహణ అధికారులు రోషన్ కుటుంబానికి ఆర్థిక సాయం అందించే ప్రక్రియ ప్రారంభించారు. మొత్తం రూ.5 లక్షల పరిహారం ప్రకటించినట్లు అధికారులు తెలిపారు. ఇందులో రూ.4 లక్షలు రాష్ట్ర విపత్తు స్పందన నిధి (SDRF) నుంచి, మరో రూ.1 లక్ష జాతీయ విపత్తు స్పందన నిధి (NDRF) నుంచి అందించనున్నారు.
తాజా ఘటన మరోసారి వర్షాకాలంలో పిడుగుల ప్రమాదం ఎంత తీవ్రంగా ఉంటుందో గుర్తు చేసింది. ముఖ్యంగా వ్యవసాయ భూములు, బహిరంగ ప్రదేశాల్లో ఉండే వారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.