అయ్యో దేవుడా.. బిడ్డకు జన్మనిచ్చి.. కన్నుమూసిన తల్లి..

కేరళలో బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత 22 ఏళ్ల జరియత్ అనే మహిళ మరణించింది. కొల్లం జిల్లాలోని కరుణగప్పల్లి ఆసుపత్రిలో ప్రసవించిన తర్వాత ఆమెకు బీపీ పడిపోయింది. మెరుగైన చికిత్స కోసం మరో ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మరణించింది. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే ఆమె చనిపోయిందని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

అయ్యో దేవుడా.. బిడ్డకు జన్మనిచ్చి.. కన్నుమూసిన తల్లి..
22 Year Old Woman Dies Post Delivery

Updated on: Oct 20, 2025 | 10:10 AM

బిడ్డను భూమిమీదకు తీసుకరావడానికి తల్లి పడే ప్రసవవేదన వర్ణించలేనిది. తన ప్రాణం పోతున్నా బిడ్డకు జన్మనిస్తుంది అమ్మ. తాజాగా కేరళలో బిడ్డకు జన్మనిచ్చి తల్లి మరణించడం బాధాకరం. కొల్లంలోని కరుణగప్పల్లిలో ప్రసవించిన తర్వాత చికిత్స పొందుతూ 22 ఏళ్ల జరియత్ అనే మహిళ చనిపోయింది. అయితే డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే జరియత్ చనిపోయిందని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కొల్లంలోని తేవలక్కరకు చెందిన నౌఫాల్ భార్య జరియత్.. అలప్పుజలోని వందనం టీడీ మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున మరణించారు.

ఆసుపత్రిలో ఏం జరిగింది..?

సోమవారం కరుణగప్పల్లి తాలూక్ ఆసుపత్రిలో చేరిన జరియత్ శుక్రవారం తెల్లవారుజామున 1.30 గంటలకు ప్రసవించింది. ప్రసవం తర్వాత ఆమెను పోస్ట్ ఆపరేటివ్ వార్డుకు తరలించారు. ఆమెకు బీపీ బాగా పడిపోవడంతో, వెంటనే అలప్పుజలోని పెద్ద ఆసుపత్రికి పంపించమని డాక్టర్లు సలహా ఇచ్చారు. నాలుగు రోజులు నొప్పితో బాధపడుతున్నా, ఒక డాక్టర్ తన షిఫ్ట్ అయిపోయిందని చూసేందుకు నిరాకరించారు” అని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సరైన సంరక్షణ ఇవ్వలేదని కూడా వారు అంటున్నారు.

చివరకు వందనం మెడికల్ కాలేజీకి తీసుకెళ్లినా ఆమెకు న్యుమోనియా, ఫిట్స్ వంటి సమస్యలు వచ్చాయి. ఆదివారం తెల్లవారుజామున ఆమె చనిపోయింది. ప్రాథమికంగా, ఆమె కాలి వేళ్ల నరాల్లో రక్తం ఆగిపోవడం మరణానికి ఒక కారణమై ఉండొచ్చని కుటుంబం చెబుతోంది.

డాక్టర్లు ఏమన్నారంటే..?

కరుణగప్పల్లి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ థామస్ అల్ఫోన్స్ దీనిపై వివరణ ఇచ్చారు. ప్రసవంలో ఇబ్బంది రావడంతో సాధారణ డెలివరీ కాకుండా సిజేరియన్ ఆపరేషన్ చేశామని ఆయన చెప్పారు. “ఆపరేషన్ అయిన 15 నిమిషాలకే ఆమె బీపీ తగ్గింది. అందుకే వెంటనే పెద్ద ఆసుపత్రికి పంపించాం. మేము చేయగలిగిన సహాయం చేశాం” అని డాక్టర్ అల్ఫోన్స్ అన్నారు. అసలు మరణానికి కారణం పోస్ట్‌మార్టం రిపోర్ట్ వస్తేనే తెలుస్తుందని ఆయన తెలిపారు.
కుటుంబం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చనిపోయిన జరియత్ బిడ్డ ఆరోగ్యంగా, క్షేమంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Follow Us