కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై సమర శంఖం పూరించడానికి విపక్షాలు సమాయత్తమవుతున్నాయి. 2024 ఎన్నికలే ప్రధాన అజెండాగా మంగళవారం ఢిల్లీలోని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నివాసం…6 జనపథ్ లో జరిగే మీటింగ్ లో దాదాపు 15 పార్టీల నేతలు పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. యశ్వంత్ సిన్హా తో బాటు పవన్ వర్మ, సంజయ్ సింగ్, డి.రాజా, ఫరూక్ అబ్దుల్లా, జస్టిస్ ఏ.పి. సింగ్, కరణ్ థాపర్, కె.టి.ఎస్. తులసి, జావేద్ ఆఖ్తర్, అశుతోష్, వందనా చవాన్, ఎస్.వై.ఖురేషీ, ప్రీతిష్ నంది, అరుణ్ కుమార్ తదితరులు దీనికి హాజరయ్యే అవకాశాలున్నాయని ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ తెలిపారు. అన్ని విపక్షాలను సమైక్య పరచేందుకు పవార్ కృషి చేస్తున్నారని ఆయన చెప్పారు. నగరంలో మంగళవారం తమ పార్టీ జాతీయ కార్యవర్గం కూడా సమావేశమయ్యే సూచనలు ఉన్నాయని ఆయన చెప్పారు. యశ్వంత్ సిన్హా, నటుడు, రాజకీయ నేత శత్రుఘ్న సిన్హా 2018 లో ఏర్పాటు చేసిన నేషనల్ ఫోరం ఆధ్వర్యాన ఈ సమావేశం జరుగుతుందని భావిస్తున్నారు. ఈ ఫోరంలో డజనుకు పైగా పార్టీలు ఉన్నాయి. పవార్ అధ్యక్షతన ఈ మీటింగ్ జరుగుతుందని నవాబ్ మాలిక్ తెలిపారు.
2024 ఎన్నికలకు ముందే ప్రతిపక్షాల మధ్య విస్తృత అవగాహన కుదరవలసి ఉందని, వీటిని ఒక్క తాటిపైకి తెచ్చి.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడవలసి ఉందని, ఇందులో భాగంగా థర్డ్ ఫ్రంట్ ను ఏర్పాటు చేయాలనే యోచనలో ఉన్నామని పవార్ ఇటీవల వ్యాఖ్యానించారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా ఇదే నెలలో రెండు సార్లు ఆయనతో భేటీ కావడంతో ఈ ఊహాగానాలు మరింత బలం పుంజుకున్నాయి. ఆప్, తృణమూల్ కాంగ్రెస్, ఆర్జేడీ, లెఫ్ట్ వంటి పలు పార్టీలు బహుశా మనస్ఫూర్తిగా ఈ ఫ్రంట్ కి మద్దతు నివ్వాలనే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.
మరిన్ని ఇక్కడ చూడండి: Menstrual Problems: కరోనా ఇబ్బందులతో మనదేశంలో మహిళల్లో ఎక్కువ మందికి పీరియడ్స్ ఇబ్బందులు..సర్వేలో వెల్లడి
బిలియనీర్ జెఫ్ బెజోస్ అంతరిక్షంలోనే ఉండాలట……భూమికి తిరిగి రావద్దంటున్న నెటిజన్లు …ఇదెక్కడి వింత ..?