NHAI : హైవేలపై వంతెనల భద్రత కోసం NHAI కొత్త రూల్స్.. రంగంలోకి 12 ఐఐటీలు!
దేశంలో కొత్తగా హైవేలపై నిర్మించబోయే బ్రిడ్జిల విషయంలో NHAI కీలక నిర్ణయం తీసుకుంది. హైవేలపై మేజర్ బ్రిడ్జిల హైడ్రాలిక్ స్టడీస్, స్ట్రక్చరల్ డిజైన్ల పరిశీలనకు IITలతో భాగస్వామ్యం చేసుకుంది.100 ఏళ్లకు పైగా మన్నికే లక్ష్యంగా వంతెనల నిర్మాణానికి ముందే కఠినమైన టెక్నికల్ స్టడీ చేసేలా సరికొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది.

జాతీయ రహదారుల నెట్వర్క్ భద్రత, నాణ్యత, దీర్ఘకాలిక మన్నికను మరింత బలోపేతం చేసే దిశగా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 100 ఏళ్లకు పైగా మన్నికే లక్ష్యంగా, వంతెనల నిర్మాణానికి ముందే కఠినమైన టెక్నికల్ స్టడీ చేసేలా సరికొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది.దేశవ్యాప్తంగా అన్ని ప్రాజెక్టులకూ ఒకే రకమైన క్వాలిటీ రూల్ ఉండేలా నూతన మార్గదర్శకాలను జారీ చేసింది.
దేశవ్యాప్తంగా కొత్తగా నిర్మించబోయే ప్రధాన వంతెనల హైడ్రాలిక్ అధ్యయనాలు, స్ట్రక్చరల్ డిజైన్ల పరిశీలన కోసం ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ బాంబే, ఐఐటీ రూర్కీ, ఐఐటీ ఖరగ్పూర్లతో సహా దాదాపు 12 ఐఐటీలు, ఇతర ప్రముఖ సాంకేతిక సంస్థలతో NHAI భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ సాంకేతిక సంస్థలు నిర్మాణ పనులు ప్రారంభం కావడానికి ముందే వాటి డిజైన్లపై సమగ్ర సమీక్ష జరిపి, వంతెనలు బలంగా, పటిష్టంగా ఉండేలా చూస్తాయి.
ఈ ప్రక్రియలో భాగంగా వంతెనల నిర్మాణ డిజైన్ లెక్కలు, ఇంజనీరింగ్ డ్రాయింగ్లు, నిర్మాణ పద్ధతులు, జియోటెక్నికల్ (భూగర్భ) పరిశోధనలు, హైడ్రాలిక్ అధ్యయనాలను నిపుణులు క్షుణ్ణంగా సమీక్షిస్తారు. వివిధ రకాల నిర్మాణ విధానాలలో అమలు చేయబడుతున్న అన్ని ప్రాజెక్టులకు ఈ నిబంధనలు సమానంగా వర్తిస్తాయి. దీనివల్ల అన్ని ప్రాజెక్టులలో స్థిరమైన నాణ్యత నియంత్రణ సాధ్యమవుతుంది.
ఈ వినూత్న చొరవ వంతెనల నిర్మాణ భద్రతను గణనీయంగా పెంచడమే కాకుండా, డిజైన్ విశ్వసనీయతను మెరుగుపరుస్తుందని మరియు దీర్ఘకాలిక ప్రమాదాలను నివారిస్తుందని NHAI స్పష్టం చేసింది. అత్యుత్తమ ఇంజనీరింగ్ పద్ధతులను అవలంబిస్తూ, భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా సురక్షితమైన జాతీయ రహదారులను నిర్మించడమే దీని ప్రధాన లక్ష్యమని తెలిపింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
