కరోనా బాధితులతో మాట్లాడిన ఆరోగ్య మంత్రి
ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కరోనా బాధితులతో ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.
ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కరోనా బాధితులతో ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆసుపత్రుల్లో వైద్య సదుపాయాలు, పారిశుద్ధ్యం, ఆహారం, నీరు తదితర విషయాలపై బాధితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చికిత్స పొందుతున్న వారు మాట్లాడుతూ.. ఆసుపత్రుల్లో కరోనా బాధితులకు మంచి సేవలను అందిస్తున్నారని అన్నారు. సమయానికి మందులు ఇస్తూ, మంచి నాణ్యత కలిగిన పౌష్టికాహారం అందిస్తూ.. ఎప్పటికప్పుడు శానిటైజేషన్ నిర్వహిస్తున్నారని తెలిపారు.
కాగా టెస్ట్ల సంఖ్య పెంచడం వలన ఫలితాల్లో జాప్యం జరుగుతుందన్న మంత్రి.. ఆహార సరఫరాలో అవినీతి చేస్తే గుత్తేదారులను వెంటనే తొలగిస్తాం అని అన్నారు. ప్రైవేట్ ల్యాబ్ల్లో ఒకట్రెండు తప్పుడు ఫలితాలు వచ్చినట్లు తమ దృష్టికి వచ్చిందని, మరోసారి తప్పుడు రిపోర్ట్ ఇస్తే లైసెన్స్ రద్దు చేయడానికి కూడా వెనకాడమని ఈ సందర్భంగా ఆళ్ల నాని హెచ్చరించారు. ఇక ఏ సమస్యలున్నా తమ దృష్టికి తీసుకురావాలని ఈ సందర్భంగా వైద్యులకు సూచించారు మంత్రి.