
నేటి డిజిటల్ యుగంలో మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, టీవీల వాడకం పెరగడంతో స్క్రీన్ సమయం కూడా గణనీయంగా పెరిగింది. దీని ఫలితంగా కళ్ళు,మెదడుపై ఒత్తిడి పెరిగి తలనొప్పులు, మైగ్రేన్ సమస్యలు అధికమవుతున్నాయి. పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ ఈ సమస్యతో బాధపడుతున్నారు. కొందరు కాలక్షేపం కోసం దీనిని ఉపయోగిస్తే మరికొందరు వృత్తి రిత్యా వాడుతున్నారు. కారణం ఏదైనా స్క్రీన్ సమయం పెరుగుతోంది. ఇది భవిష్యత్తులో మైగ్రేన్ సమస్యను పెంచుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్క్రీన్ సమయానికి, మైగ్రేన్కు మధ్య సంబంధం ఏమిటి? ఎవరికి ఎక్కువ ప్రమాదం ఉంది? వంటి విషయాలు నిపుణుల మాటల్లో మీ కోసం..
నిపుణుల అభిప్రాయం ప్రకారం స్క్రీన్ ముందు ఎక్కువ సమయం గడపడం వల్ల కళ్ళపై నిరంతరం ఒత్తిడి పడుతుంది. ముఖ్యంగా స్క్రీన్ నుంచి వెలువడే నీలి కాంతి కళ్ళను త్వరగా అలసిపోయేలా చేస్తుంది. ఇది మెదడుపై మరింత ఒత్తిడిని కలిగించి, మైగ్రేన్లకు దారితీసేలా చేస్తుంది. మైగ్రేన్ ప్రారంభమయ్యే ముందు కొంతమందికి మినుకుమినుకుమనే కాంతి, తల బరువుగా అనిపించడం, వెలుగు చూడలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
రోజంతా కంప్యూటర్లు లేదా మొబైల్ ఫోన్లు వాడే వారికి మైగ్రేన్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే నేటి కాలంలో పిల్లలు, యువతలో ఈ సమస్య పెరుగుతోందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే మైగ్రేన్లతో బాధపడుతున్న వారు స్క్రీన్ను అధికంగా వాడటం వల్ల ఆ సమస్య మరింత తీవ్రమవుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఎక్కువసేపు స్క్రీన్ను చూడటం వల్ల కళ్లు పొడిబారడం, కళ్లలో చికాకు, అలసట, నిద్రలేమి వంటి సమస్యలు కలుగుతాయి. ఈ కారణాలన్నీ కలిసి తలనొప్పులు, మైగ్రేన్ల సమస్యను పెంచుతాయి.
వీటి నివారణకు స్క్రీన్ వాడకాన్ని నియంత్రించడం చాలా ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. ప్రతి 20-30 నిమిషాలకు విరామం తీసుకోవాలి. కళ్ళకు విశ్రాంతి ఇవ్వడానికి దూరంగా ఉన్న వస్తువులను చూడాలి. స్క్రీన్ బ్రైట్నెస్ సరిగ్గా ఉండాలి. చీకటిలో మొబైల్ వాడటం మానుకోవాలి. సరైన నిద్ర, సమతుల్య ఆహారం, క్రమం తప్పని వ్యాయామం మైగ్రేన్లను నియంత్రించడంలో సహాయపడతాయి. శరీరం ఇచ్చే సంకేతాలను విస్మరించకుండా, సకాలంలో వైద్య సలహా తీసుకోవడం అవసరం. నిపుణుల అభిప్రాయం ప్రకారం స్క్రీన్ వాడకాన్ని సమతుల్యంగా ఉంచుకోవడం వల్ల మైగ్రేన్ల ప్రమాదాన్ని తగ్గించి, మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.