
సాధారణంగా మనందరి ఇళ్లల్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తప్పనిసరిగా చేస్తుంటారు. ఇందుకోసం ఇడ్లీ, దోస, ఉప్మా, చపాతీ, పూరీలతో పాటు వడ కూడా చాలా ఫేమస్. బ్రేక్ఫాస్ట్లో ఎక్కువ మంది చేసేది ఇడ్లీ వడ, రెండు ఇడ్లీ తిన్నాక ఒక్కటైన వడ తింటేనే తృప్తిగా ఉంటుంది కొందరికీ. చాలా మందికి బ్రేక్ఫాస్ట్లోకి వడ అంటే ఇష్టపడుతుంటారు. చట్నీ, సాంబార్లో వడను తింటే ఆ ఫీలింగ్ నెక్స్ట్ లెవల్ అని చెప్పాలి. మరికొందరు చికెన్, మటన్ కర్రీల్లో వడ కాంబినేషన్ను ఆస్వాదిస్తారు. పండగల సమయంలో కచ్చితంగా వడలు వండుకుని తినాల్సిందే. అయితే, మీరు ఎప్పుడైనా ఆలోచించారా? వడ మధ్యలో రంధ్రం ఎందుకు ఉంటుందని? వడ మధ్యలో రంధ్రం ఎందుకు ఉంటుందో, దాని వెనుక కారణాలు ఇక్కడ తెలుసుకుందాం.
వడలు సాధారణంగా మందంగా ఉంటాయి. వడ మధ్యలో రంధ్రం లేకుండా వేయించినట్టయితే, బయట భాగం త్వరగా ఉడికిపోతుంది. కానీ, లోపల పిండి పచ్చిగా ఉంటుంది. ఒక రంధ్రం చేసి వేడి నూనెలో వేయడం వల్ల వడ లోపల, వెలుపల సమానంగా వేయించవచ్చు. ఈ విధంగా, వడ అన్ని వైపులా సమానంగా ఉడికిపోతుంది. పూర్తిగా ఫ్రై అయిన తరువాత వడ బంగారు రంగులో క్రిస్పీగా మారుతుంది. ఈ పద్ధతిని డోనట్స్ తయారీలో కూడా ఉపయోగిస్తారు.
వడలో రంధ్రాలు చేయడానికి ఇతర కారణాలు కూడా ఉన్నాయి. వడ బాగా ఉబ్బకుండా నిరోధించడానికి మధ్యలో రంధ్రం పెడతారు. వడ మధ్యలో రంధ్రం చేయకపోతే అది బాగా ఉబ్బుతుంది. ఇది వడ మృదుత్వం, రుచి రెండింటీని ప్రభావితం చేస్తుంది. అందుకే వడ ఉబ్బకుండా ఉండటానికి మధ్యలో ఒక రంధ్రం చేస్తారు. వడ మధ్యలో ఈ రంధ్రం చేయడం వల్ల ఉపరితల వైశాల్యం పెరుగుతుంది. ఉపరితల వైశాల్యం ఎంత ఎక్కువగా ఉంటే, వేడి నూనెలో వడను వేయించడం సులభం అవుతుంది.
వడ లోపలి భాగం తక్కువ సమయంలో ఉడికిపోతుంది. మొత్తం వడ పరిపూర్ణంగా ఉడికిపోతుంది. ఈ రంధ్రం వడను వేయించేటప్పుడు స్థిరంగా ఉంచుతుంది. అదనపు నూనె సులభంగా బయటకు పోతుంది. ఈ రంద్రం కారణంగా లోపల, వెలుపల సమానంగా ఉడికి, వడను మృదువుగా చేస్తుంది. కాబట్టి, మినప వడ మధ్యలో ఉన్న రంధ్రం ఆకారం కోసం మాత్రమే కాదు, వంట ప్రక్రియలో ఒక ముఖ్యమైన భాగం.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..