Krishnadevaraya : విజయనగర మహాసామ్రాజ్య విస్తరణలో యుగ పురుషుడిగా ఆయనకు చారిత్రక నేపథ్యం ఉంది. సుపరిపాలన, రాజనీతిలో నిలిచిన రాజుల్లో ముందు వరుసలో ఉన్న ఆయన, మహాసామ్రాజ్యాధీశుడుగా.. సకల కళా వల్లభుడిగా పేరు గాంచారు. అయితే అంతుచిక్కని రహస్యంగా మారిన అతని నిష్క్రమణపై చారిత్ర ఆధారం లభించినట్టేనని తేల్చేశారు చరిత్రకారులు. విజయనగర మహాసామ్రజ్య విస్తరణలో శ్రీకృష్ణదేవరాయల దక్షతకు చరిత్రే సాక్ష్యం. ఆయన కళాభిమానానికి హంపి సహా దక్షిణ భారత్లో నేటికి సగర్వంగా నిలిచిన చారిత్రక కట్టడాలే నిదర్శనం. ఆయన సాహితీ పిపాసకు ..తెలుగుభాష అంటే మక్కువ ఎక్కువ. అయితే కృష్ణదేవరాయులు మరణంపై ఆది నుంచి అనుమానాలే. ఆయన గతించిన తేదీపై ఎలాంటి క్లారిటీ లేదు. కానీ తాజాగా కర్నాటకలోని ఓ చారిత్రక శాసనంలో కృష్ణదేవరాయల మరణతేదీపై సందిగ్ధం వీడింది.
శ్రీకృష్ణదేవరాయలకు సంబంధించి ఇప్పటికే అనేక పరిశోధనలు సాగుతున్నాయి. ఆయన ఎప్పుడు పుట్టారు..? ఎప్పుడు మరణించారు..? అన్న విషయాలపై కచ్చితమైన ఆధారాలు లేకపోవడంతో ఇప్పుడు ఓ క్లారిటీకి వచ్చినట్టు తెలుస్తోంది. కర్ణాటకలోని తుమకూర్ జిల్లాలోని ఒక ఆలయంలో ఈ శాసనం బయటపడింది. ఈ శాసనం ప్రకారం.. కృష్ణదేవరాయలు అక్టోబర్17,1529న తుదిశ్వాస విడిచారని తేలింది. ధన్పాల్ అనే బస్సు డ్రైవర్ మొదట దీన్ని గుర్తించి పురావస్తు అధికారులకు సమాచారం అందించాడు. దాంతో పరిశోధకులు హొన్నెనహళ్లి గ్రామంలోని గోపాలకృష్ణ ఆలయంలో నల్ల రాతిపై ఈ శాసనాన్ని గుర్తించారు. తుళు భాషలో చెక్కిన ఈ శాసనమే..ఆయన మరణ సందేశం.
దీని ద్వారా కృష్ణదేవరాయలు మరణించిన కచ్చితమైన తేదీ బయటకు వచ్చిందని డైరెక్టరేట్ ఆఫ్ ఎపిగ్రఫీ నిపుణులు ప్రకటించారు. కృష్ణదేవరాయలు తమ్ముడు అచ్యుతా దేవరాయలు 1529 అక్టోబర్ 21న తులువా రాజవంశం నాల్గవ రాజుగా పట్టాభిషక్తుడయ్యాడు. ఇందుకు సంబంధించిన ఓ శాసనం గతంలో ఆంధ్రప్రదేశ్లోని శ్రీ కాళహస్తిలో లభ్యమైంది. అయితే అంతకంటే కొద్దిరోజుల ముందే శ్రీకృష్ణదేవరాయలు మరణించి ఉంటారని అంతా భావించారు. కానీ.. కచ్చితమైన తేదీ అప్పుడు లభించలేదు. తాజాగా బయటపడ్డ శానసంలో అన్ని వివరాలు వెలుగుచూశాయి.