
నీతి కథలు పిల్లల్లో నైతిక విలువలు పెంచడంతో పాటు వ్యక్తిత్వ వికాసం, సృజనాత్మకత పెంచేందుకు ఎంతగానో దోహదపడుతాయి. పిల్లలు, పెద్దలకు వినోదంతో పాటు జీవిత పాఠాలు నేర్పే నీతి కథలు చాలా ప్రత్యేకమైవే. అలాంటి కథల్లో ‘తెలివితక్కువ నక్క’ కథ ఒకటి. ఈ కథ ద్వారా దురాశ, తొందరపాటు ఎంత ప్రమాదకరమో సులభంగా అర్థం అవుతుంది. జీవితంలో దూరదృష్టి లేదా ముందు చూపు లేకపోవడం వల్ల ఎలాంటి నష్టాలు జరుగుతాయో ఈ కథతో మనకు అర్థమవుతుంది.
అనగనగా ఒక అడవిలో ఒక నక్క ఉండేది. దానికి అత్యాశ ఎక్కువ. ఆలోచించి నిర్ణయం తీసుకునే తెలివి మాత్రం తక్కువ. ఏ పని చేసినా దాని వల్ల వచ్చే పరిణామాల గురించి ముందుచూపుతో ఆలోచించేది కాదు. ఒక రోజు ఆహారం కోసం అడవిలో తిరుగుతుండగా, రెండు గొర్రెపోతులు ఒకదానితో ఒకటి భయంకరంగా పోట్లాడుకుంటున్నాయి. అవి బలంగా తలలు ఢీకొట్టుకోవడంతో రెండింటి తలల నుంచి రక్తం కారుతోంది.
ఆ దృశ్యం చూసిన నక్క మనసులో ఒక ఆలోచన వచ్చింది. ఈ గొర్రెపోతుల్లో ఒకటి తప్పకుండా చనిపోతుంది. అప్పుడు దాని మాంసం నాలుగైదు రోజులు తినొచ్చు. అప్పటివరకు తల నుంచి కారుతున్న రక్తాన్ని కూడా తాగొచ్చు అని ఆశపడింది. రక్తం వాసన రావడంతో నక్క నోట్లో నీళ్లు ఊరాయి. గొర్రెపోతులు ఇంకా పోట్లాడుతూనే ఉన్నాయి. నేలంతా రక్తంతో నిండిపోయింది.
రక్తాన్ని చూసి నక్క తన ఆత్రుతను అదుపులో పెట్టుకోలేకపోయింది. గొర్రెపోతులు మళ్లీ ఢీకొట్టుకునేందుకు కొన్ని అడుగులు వెనక్కి వెళ్లిన వెంటనే, నక్క పరుగెత్తి వెళ్లి నేలపై ఉన్న రక్తాన్ని నాకుతూ మైమరచిపోయింది. రక్తం రుచిలో మునిగిపోయిన నక్కకు చుట్టూ ఏం జరుగుతుందో కూడా తెలియలేదు. అంతలోనే గొర్రెపోతులు మళ్లీ ఒకదానిపై మరొకటి వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి బలంగా ఢీకొన్నాయి. వాటి మధ్యలో రక్తాన్ని నాకుతున్న నక్క చిక్కుకుంది. రెండు గొర్రెపోతుల బలంగా ఢీకొట్టడంతో నక్క అక్కడికక్కడే నలిగి చనిపోయింది.
నక్క కొద్దిసేపు ఆగి పరిస్థితిని గమనించి ఉంటే ప్రాణాలు దక్కేవి. రాబోయే ప్రమాదాన్ని ముందుగా ఊహించలేని తెలివితక్కువ నక్క.. తన అత్యాశ వల్ల ప్రాణాలు కోల్పోయింది.
దురాశ దుఃఖానికి చేటు అనే జీవిత సత్యాన్ని ఈ కథ నేర్పుతుంది. అతిగా ఆశపడటం, పరిస్థితిని అర్థం చేసుకోకుండా తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఉన్న అవకాశాలు కూడా కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఆలోచించి వ్యవహరించే వారే జీవితంలో విజయాన్ని సాధిస్తారు.
Also Read: నిజమైన స్నేహితుడు ఎవరు? జీవితాంతం గుర్తుండిపోయే నీతి కథ