
నేటి కాలంలో మధుమేహం ఉన్నవారు ఉదయం పూట ఎలాంటి అల్పాహారం తీసుకోవాలనే విషయంలో చాలా గందరగోళానికి గురవుతుంటారు. ఉదయపు టిఫిన్ అనేది రక్తంలో చక్కెర స్థాయిలను అకస్మాత్తుగా పెంచనిదై ఉండాలి. దీనికి సిద్ధ వైద్య నిపుణులు డాక్టర్ నిత్య ఒక అద్భుతమైన సాంప్రదాయ, శాస్త్రీయ పరిష్కారాన్ని సూచించారు. రోజూ ఉదయం తీసుకునే రాగి అల్పాహారంలో మెంతులను కూడా చేర్చుకోవడం వల్ల డయాబెటిస్ను ఎలా నియంత్రణలో ఉంచుకోవచ్చో ఆమె వివరించారు.
రాగులు పోషకాల గని. ఇందులో క్యాల్షియం, ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. రాగుల గ్లైసీమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటమే కాకుండా, ఇందులో ఉండే పాలిఫెనాల్స్, డైటరీ ఫైబర్ ఆహారం త్వరగా జీర్ణం కాకుండా చూస్తాయి. దీనివల్ల రక్తంలోకి గ్లూకోజ్ ఒకేసారి కాకుండా చాలా నెమ్మదిగా విడుదలవుతుంది. ఇది డయాబెటిస్ ఉన్నవారికి రోజంతా స్థిరమైన శక్తిని ఇస్తుంది.
మెంతులలో గెలాక్టోమన్నన్ అనే సహజ పీచు పదార్థం ఉంటుంది. ఇది ప్రేగులలో చక్కెర శోషణ రేటును తగ్గిస్తుంది. అంతేకాకుండా, మెంతులలో ఉండే అమైనో ఆమ్లాలు ప్యాంక్రియాస్ నుండి ఇన్సులిన్ హార్మోన్ విడుదలను ప్రేరేపించడానికి సహాయపడతాయి. ఇది కణాలలో గ్లూకోజ్ వినియోగాన్ని మెరుగుపరుస్తుంది.
మెంతి రాగి అంబలి / జావ: రాగి పిండితో జావ లేదా గంజి తయారు చేసేటప్పుడు అందులో అర చెంచా వేయించిన మెంతి పొడిని కలపాలి. ఈ మిశ్రమాన్ని ఉదయం పరగడుపున తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగవ్వడమే కాకుండా షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. ఇది శరీరానికి చలువ చేస్తుంది.
రాగి-మెంతి దోశ లేదా ఇడ్లీ: దోశ పిండి రుబ్బేటప్పుడు రాగులతో పాటు ఒక టేబుల్ స్పూన్ మెంతులను కూడా కలిపి నానబెట్టాలి. ఈ పిండితో ఉదయం పూట వేడివేడి ఇడ్లీలు లేదా దోశలు వేసుకుని తింటే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం లభిస్తాయి.
ఈ అల్పాహార కలయిక కేవలం మధుమేహానికే కాకుండా, శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడానికి, బరువు నియంత్రణకు, ఎముకల దృఢత్వానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా వేసవి కాలంలో శరీరాన్ని చల్లబరచడానికి ఇది అద్భుతంగా తోడ్పడుతుంది. అయితే, ఇన్సులిన్ లేదా మందులు వాడుతున్న వారు తమ షుగర్ స్థాయిలను క్రమం తప్పకుండా తనిఖీ చేసుకుంటూ, ఈ ఆహారాన్ని వైద్యుల సలహాతో దినచర్యలో చేర్చుకోవడం మంచిది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..