AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Musical Road: రోడ్డుపై కారు వెళ్తుంటే ‘జయహో’ సాంగ్.. ఇండియాలోనే తొలి మ్యూజికల్ రోడ్డు సిద్ధం!

సాధారణంగా రోడ్ల మీద ప్రయాణించేటప్పుడు టైర్ల నుంచి వచ్చే కిర్రుమనే శబ్దం లేదా ఇంజిన్ హోరు మనకు వినిపిస్తుంది. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఆ రహదారి మాత్రం అందుకు భిన్నం. అక్కడ మీరు కారు డ్రైవ్ చేస్తుంటే.. రేడియో లేదా మొబైల్ ఆన్ చేయకపోయినా సరే, మీ కారు లోపల అద్భుతమైన సంగీతం వినిపిస్తుంది.

Musical Road: రోడ్డుపై కారు వెళ్తుంటే ‘జయహో’ సాంగ్.. ఇండియాలోనే తొలి మ్యూజికల్ రోడ్డు సిద్ధం!
Mumbai Road .jpg
Nikhil
|

Updated on: Feb 13, 2026 | 7:49 PM

Share

అది మనందరికీ ఇష్టమైన దేశభక్తి గీతం ‘జై హో’. వినడానికి వింతగా ఉన్నా ఇది అక్షరాలా నిజం. ముంబైలో కొత్తగా నిర్మించిన కోస్టల్ రోడ్డు ప్రాజెక్టులో భాగంగా ఒక ప్రత్యేకమైన విభాగాన్ని ‘మ్యూజికల్ రోడ్డు’గా మార్చారు. ప్రపంచంలోనే ఐదో రోడ్డుగా, మన దేశంలోనే మొదటి రోడ్డుగా రికార్డు సృష్టించబోతున్న ఈ మ్యాజికల్ హైవే విశేషాలు.. దాని వెనుక ఉన్న టెక్నాలజీ ఏంటో వివరంగా తెలుసుకుందాం..

నారిమన్ పాయింట్ నుంచి వర్లీ వైపు వెళ్లే ముంబై కోస్టల్ రోడ్డు మార్గంలో ఈ సరికొత్త ప్రయోగాన్ని చేపట్టారు. వాహనదారులు ప్రయాణించేటప్పుడు వారిలో స్ఫూర్తిని నింపడానికి, దేశభక్తిని చాటడానికి ‘జై హో’ పాటను ఎంచుకున్నట్లు అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 11న మధ్యాహ్నం 12:30 గంటలకు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ మ్యూజికల్ రోడ్డును అధికారికంగా ప్రారంభించనున్నారు. ముంబై వాసుల రోజువారీ ప్రయాణాన్ని మరింత ఆహ్లాదకరంగా మార్చడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం.

ఈ రోడ్డుపై సంగీతం ఎలా వినిపిస్తుందనే సందేహం రావడం సహజం. దీని కోసం రోడ్డు ఉపరితలంపై ప్రత్యేకమైన మ్యూజికల్ స్ట్రిప్స్‌ను అమర్చారు. కారు కిటికీలు పూర్తిగా మూసివేసినా సరే, వాహనం ఆ స్ట్రిప్స్‌పై నుంచి వెళ్తున్నప్పుడు వచ్చే ప్రకంపనలు కారు లోపల సంగీత స్వరాలను సృష్టిస్తాయి. అయితే ఇక్కడ ఒక కండిషన్ ఉంది. కారు వేగం గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల మధ్య ఉన్నప్పుడు మాత్రమే ‘జై హో’ ట్యూన్ స్పష్టంగా వినిపిస్తుంది. ఈ అద్భుతాన్ని ఆవిష్కరించడానికి హంగేరీ దేశానికి చెందిన ఒక ప్రముఖ కంపెనీని బీఎంసీ నియమించింది.

సంగీతంతో కూడిన వినోదం..

ముంబై కోస్టల్ రోడ్డు ఇప్పటికే ట్రాఫిక్ లేని వేగవంతమైన ప్రయాణానికి మారుపేరుగా నిలిచింది. ఇప్పుడు ఈ మ్యూజికల్ ఫీచర్ తోడవ్వడంతో ఇది ముంబై నగరానికి ఒక ప్రత్యేక ఆకర్షణగా మారబోతోంది. టెక్నాలజీ మరియు వినోదాన్ని మేళవించి చేసిన ఈ ప్రయోగం దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రానున్న రోజుల్లో మరిన్ని ప్రధాన నగరాల్లో ఇలాంటి మ్యూజికల్ రోడ్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. భారతదేశంలోనే తొలిసారిగా చేపట్టిన ఈ ప్రాజెక్టు కోసం సుమారు రూ.6.21 కోట్లకు పైగా ఖర్చు చేశారు.

ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, మ్యూజికల్ రోడ్డు రాబోతుందనే విషయాన్ని తెలియజేయడానికి రహదారిపై 500 మీటర్లు, 100 మీటర్లు మరియు 60 మీటర్ల ముందే ప్రత్యేక సైన్ బోర్డులను ఏర్పాటు చేశారు. దీనివల్ల డ్రైవర్లు అప్రమత్తమై నిర్ణీత వేగంతో ప్రయాణించి ఆ సంగీతాన్ని ఆస్వాదించే అవకాశం ఉంటుంది. టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ ప్రయాణాలు కేవలం ఒక చోటు నుంచి మరో చోటుకు వెళ్లడం మాత్రమే కాకుండా.. ఒక మధురమైన జ్ఞాపకంగా మారుతున్నాయి. ముంబై వెళ్లే పర్యాటకులు ఈ జై హో ట్యూన్‌ను మిస్ అవ్వకుండా ఉండాలంటే కోస్టల్ రోడ్డుపై డ్రైవ్ చేయాల్సిందే.