
ఈ రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా పిల్లల నుండి పెద్దల వరకు అందరినీ వేధించే ప్రధాన సమస్యల్లో చుండ్రు ఒకటి. ఎంత మంచి సంరక్షణ పద్ధతులు పాటించినప్పటికీ చాలామందిలో ఈ సమస్య మళ్లీ మళ్లీ తిరగబెడుతుంటుంది. తల నుండి తెల్లటి లేదా పసుపు రంగు పొరలు రాలడం, తీవ్రమైన దురద, పొడి చర్మం దీని ప్రధాన లక్షణాలు. చాలామంది చుండ్రును చాలా చిన్న సమస్యగా భావించి నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ ఇది ఎక్కువ కాలం కొనసాగితే తలపై వాపు, ఎరుపు, చిన్న గాయాలు ఏర్పడటమే కాకుండా తీవ్రమైన జుట్టు రాలే సమస్యకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
చుండ్రు తగ్గగానే జాగ్రత్తలు ఆపేయడం లేదా కొన్ని తప్పుడు అలవాట్లే ఈ సమస్య మళ్లీ రావడానికి ప్రధాన కారణాలు.
యాంటీ-డాండ్రఫ్ షాంపూను త్వరగా ఆపేయడం: చుండ్రు కొద్దిగా తగ్గగానే చాలామంది మెడికేటెడ్ షాంపూలు వాడటం ఆపేస్తారు. దీనివల్ల సమస్య మళ్లీ మొదటికి వస్తుంది.
షాంపూను వెంటనే కడిగేయడం: తలకు షాంపూ పెట్టగానే వెంటనే నీళ్లు పోసుకుని కడిగేయకూడదు. షాంపూ రాసిన తర్వాత కనీసం 3 నుండి 5 నిమిషాల పాటు తలపై అలానే ఉంచితేనే అందులోని ఔషధ గుణాలు సరిగ్గా పనిచేస్తాయి.
తల చర్మాన్ని సరిగ్గా శుభ్రం చేయకపోవడం: కేవలం జుట్టును కడగడం మాత్రమే సరిపోదు. తల చర్మం వద్ద నూనె, దుమ్ము, చనిపోయిన చర్మ కణాలు పేరుకుపోకుండా క్లీన్ చేసుకోవాలి.
నూనెలు, హెయిర్ ప్రొడక్ట్స్ అధికంగా వాడటం: తలకు పరిమితికి మించి నూనె రాయడం, హెయిర్ జెల్స్, స్ప్రేలు ఎక్కువగా వాడటం వల్ల మురికి పెరిగి చుండ్రు తీవ్రమవుతుంది.
తరచుగా తల గోకడం: దురదగా ఉందని నిరంతరం తల గోకడం వల్ల కుదుళ్లకు గాయాలై, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది.
షాంపూలు, చిట్కాలు కొన్ని వారాల పాటు పాటించినా చుండ్రు తగ్గకపోతే నిర్లక్ష్యం చేయకూడదు. అలాగే తలపై తీవ్రమైన దురద, వాపు, ఎర్రటి మచ్చలు, నొప్పి, కుదుళ్లలో చీము లేదా అధికంగా జుట్టు రాలుతున్నట్లయితే వెంటనే చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం మంచిది.