Gongura Pandumirchi Pachadi: ఈ స్టైల్ లో గోంగూర పచ్చడి పెడితే తిన్నవాళ్లందరూ ఫిదా అవ్వాల్సిందే..!

గోంగూర అంటేనే తెలుగువారికి నోరూరిపోతుంది. పచ్చడి, కూర, తొక్కు, నాన్​వెజ్​ వంటకాలు ఇలా గోంగూరతో ఏది చేసినా అద్భుతంగా ఉంటుంది. అందుకే చాలా మంది దీనిని ఆహారంలో భాగంగా చేసుకుంటారు. గోంగూరతో రకరకాల వంటలు చేసినా అందరికీ ఇష్టమైనది మాత్రం గోంగూర పచ్చడి.

Gongura Pandumirchi Pachadi: ఈ స్టైల్ లో గోంగూర పచ్చడి పెడితే తిన్నవాళ్లందరూ ఫిదా అవ్వాల్సిందే..!
Gongura Pickle

Updated on: Feb 18, 2025 | 5:20 PM

గోంగూర పచ్చడి రుచిని మరింత పెంచేందుకు ఇప్పుడు పండుమిర్చితో పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. మార్కెట్లో పండుమిర్చి దొరుకుతున్నాయి. కాబట్టి ఈ పచ్చడి పెట్టుకుంటే రుచి అదిరిపోతుంది. నేను చెప్పే కొలతలతో చేస్తే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఈ పచ్చడికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం అన్నింటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు

పావు కేజీ పండు మిరపకాయలు, 400 గ్రాముల గోంగూర ఆకులు, 1 టేబుల్​ స్పూన్​ మెంతులు, 1 టీ స్పూన్​ జీలకర్ర, పావు కప్పు ఆయిల్,
20 గ్రాముల చింతపండు, 75 గ్రాముల ఉప్పు, అర టీ స్పూన్​ పసుపు, పావు కప్పు వెల్లుల్లి రెబ్బలు. తాలింపు కోసం కూడా కొన్నింటిని తీసి ముందే పక్కకు పెట్టుకోవాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 6 టేబుల్​ స్పూన్ల ఆయిల్, 1 టీ స్పూన్​ ఆవాలు, 1 టీ స్పూన్​ జీలకర్ర, 1 టీ స్పూన్​ మినపప్పు, 1 టీ స్పూన్​ పచ్చి శనగపప్పు, 3 ఎండు మిర్చి, 4 దంచిన వెల్లుల్లి రెబ్బలు, 2 రెమ్మలు కరివేపాకు, చిటికెడు ఇంగువ. చెప్పినవన్నీ కూడా జాగ్రత్తగా పక్కకు పెట్టేసుకోండి. పక్కకు పెట్టుకోకుండా డైరక్ట్ వంట స్టార్ట్ చేస్తే గందరగోళంగా ఉంటుంది. అందుకే ముందే ఇలా చేసుకోవడం వల్ల చాలా రిలాక్స్ డ్ గా చేసుకోవచ్చు. పచ్చడి కూడా మంచి టేస్ట్ తో వస్తుంది.

తయారీ విధానం

ముందుగా పండు మిరపకాయలను శుభ్రంగా కడిగి, తడి లేకుండా పొడి క్లాత్​తో తుడుచుకోవాలి. తర్వాత తొడిమలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్​ చేసుకోవాలి. చింతపండులో కూడా గింజలు, పీచు లేకుండా శుభ్రంగా తీసేసి పక్కన పెట్టాలి. గోంగూరను కాడలు లేకుండా కేవలం ఆకులు మాత్రమే తీసుకుని శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత ఓ మెత్తటి క్లాత్​ మీద వేసి ఫ్యాన్​ గాలికి రాత్రి మొత్తం ఆరబెట్టుకోవాలి. గోంగూర, పండు మిర్చిలో కొంచెం తేమ ఉన్నా పచ్చడి ఎక్కువ రోజుల నిల్వ ఉండదు. ఈ విషయం గుర్తుంచుకుని వాటిలో తేమ లేకుండా చూసుకోవాలి.

స్టవ్​ ఆన్​ చేసి పాన్​ పెట్టి మెంతులు వేసి దోరగా వేయించుకోవాలి. మెంతులు వేగుతున్నప్పుడు జీలకర్ర వేసి మరోసారి వేయించుకుని స్టవ్​ ఆఫ్​ చేసి పక్కన పెట్టాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీజార్​ లోకి వేసుకుని మెత్తని పొడి చేసి పక్కన ఉంచాలి.

మరోసారి స్టవ్​ ఆన్​ చేసి పాన్​ పెట్టి నూనె పోసుకోవాలి. నూనె కాగిన తర్వాత చింతపండు, గోంగూర ఆకులు వేసి కలుపుతూ తేమ లేకుండా మగ్గించుకోవాలి. నూనెలో గోంగూర బాగా మగ్గిన తర్వాత స్టవ్​ ఆఫ్​ చేసి పూర్తిగా చల్లార్చుకోవాలి.

మిక్సీజార్​లోకి కట్​ చేసిన పండుమిర్చి ముక్కలు, ఉప్పు, పసుపు, వెల్లుల్లి రెబ్బలు వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్​ చేసుకోవాలి. ఆ తర్వాత వేయించిన మెంతులు జీలకర్ర పొడి, పూర్తిగా చల్లారిన గోంగూర వేసి మరోసారి గ్రైండ్​ చేసుకోవాలి. ఇలా గ్రైండ్​ చేసుకున్న గోంగూర పచ్చడిని గాజు జార్​లో పెట్టి ఫ్రిజ్​లో స్టోర్​ చేసుకుంటే సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది.

ఈ పచ్చడి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కొద్దిగా తాలింపు పెట్టుకోవచ్చు. లేదంటే పచ్చడి మొత్తాన్ని ఒకేసారి తాలింపు పెట్టుకున్నా నిల్వ ఉంటుంది. తాలింపు కోసం స్టవ్​ ఆన్​ చేసి పాన్​ పెట్టి నూనె పోసుకోవాలి. నూనె కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చి శనగపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఎండుమిర్చి, దంచిన వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి మరోసారి ఫ్రై చేయాలి. చివరగా ఇంగువ వేసి కలిపి స్టవ్​ ఆఫ్​ చేయాలి.

ఇందులోకి గోంగూర పచ్చడిని వేసి కలిపి పూర్తిగా చల్లారిన తర్వాత స్టోర్​ చేసుకుంటే అద్భుతంగా ఉండే గోంగూర పండుమిర్చి పచ్చడి రెడీ. వేడి వేడి అన్నంలో నెయ్యితో ఈ పచ్చడిని తింటే అమృతమే. మీరూ ఓ సారి ట్రై చేయండి.