
మారుతున్న జీవనశైలిలో గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడం సవాలుగా మారింది. అయితే మనం రోజూ తినే ఆహారంలో కేవలం రెండు పండ్లను చేర్చుకోవడం ద్వారా గుండె జబ్బుల ముప్పును భారీగా తగ్గించుకోవచ్చని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. అవకాడో, మామిడి పండ్ల కలయిక గుండె పనితీరును మెరుగుపరచడమే కాకుండా, రక్తపోటును నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తాయని శాస్త్రవేత్తలు ధృవీకరించారు.
ప్రీ-డయాబెటిస్ ఉన్న పెద్దలపై ఎనిమిది వారాల పాటు ఈ పరిశోధన జరిగింది. వీరిని రెండు గ్రూపులుగా విభజించారు.
AM గ్రూప్: వీరు రోజూ ఒక మధ్యస్థ అవకాడో మరియు ఒక కప్పు మామిడి పండును తమ భోజనంతో పాటు తీసుకున్నారు.
కంట్రోల్ గ్రూప్: వీరు పండ్లకు బదులుగా అదే స్థాయిలో కేలరీలు ఉండే పిండి పదార్థాలను తీసుకున్నారు.
ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఎవరినీ బరువు తగ్గమని చెప్పలేదు. వ్యాయామ అలవాట్లు మార్చలేదు. కేవలం ఈ రెండు పండ్ల చేర్పుతోనే ఫలితాలను విశ్లేషించారు.
రక్త ప్రవాహానికి అనుగుణంగా రక్తనాళాలు వ్యాకోచించే సామర్థ్యాన్ని పరీక్షించగా.. పండ్లు తిన్న వారిలో ఈ స్కోరు 6.7శాతం పెరిగింది. అదే పిండి పదార్థాలు తిన్న వారిలో 4.6శాతం తగ్గింది. అంటే పండ్లు తిన్న వారి ధమనులు మరింత ఆరోగ్యంగా, స్థితిస్థాపకతతో మారాయి. ముఖ్యంగా పురుషులలో డయాస్టోలిక్ రక్తపోటు గణనీయంగా మెరుగుపడింది. పండ్లు తిన్న వారిలో బీపీ పాయింట్లు తగ్గగా, పండ్లు తినని వారిలో పెరగడం గమనార్హం.
ఈ రెండు పండ్లు వేర్వేరు రుచులను కలిగి ఉన్నప్పటికీ, పోషకాల పరంగా ఒకదానికొకటి తోడవుతాయి. అవకాడోలో ఉండే మోనోఅన్శాచురేటెడ్ కొవ్వులు చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయి. ఫైబర్, పొటాషియం రక్తపోటును సమతుల్యం చేస్తాయి. విటమిన్ E, C, K లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. మామిడిలో విటమిన్ C పుష్కలంగా ఉంటుంది. ఇది ఇనుమును గ్రహించడంలో సహాయపడుతుంది. విటమిన్ A కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. బీటా-కెరోటిన్, పాలీఫెనాల్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు కణాలను ఒత్తిడి నుండి రక్షిస్తాయి.