AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చెవుడు ముంచుకొస్తోంది జాగ్రత్త.. 2050 నాటికి ప్రతి నలుగురిలో ఒకరికి వినికిడి సమస్యే! మీ చెవులను ఇలా కాపాడుకోండి

నిత్యం మనం వినే సంగీతం, ట్రాఫిక్ సౌండ్స్, ఆఫీసు పనుల్లో వాడే హెడ్‌సెట్లు.. ఇవన్నీ మనకు వినోదాన్ని లేదా సౌకర్యాన్ని ఇస్తున్నాయని అనుకుంటాం. కానీ ఇవే మనల్ని నిశ్శబ్ద ప్రపంచంలోకి నెట్టేస్తున్నాయని మీకు తెలుసా? ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఐదుగురిలో ఒకరికి ఏదో ఒక రకమైన వినికిడి లోపం ఉంది.

చెవుడు ముంచుకొస్తోంది జాగ్రత్త.. 2050 నాటికి ప్రతి నలుగురిలో ఒకరికి వినికిడి సమస్యే! మీ చెవులను ఇలా కాపాడుకోండి
Hearing Problems.jpg
Nikhil
|

Updated on: Feb 16, 2026 | 9:44 PM

Share

ఈ సమస్య కేవలం వృద్ధులకు మాత్రమే పరిమితం కాకుండా, చిన్న పిల్లల నుండి యువత వరకు అందరినీ వేధిస్తోంది. ముఖ్యంగా పేద దేశాల్లో వైద్య సదుపాయాలు లేకపోవడం వల్ల 80 శాతం మంది బాధితులు నరకం అనుభవిస్తున్నారు. భవిష్యత్తులో ఈ సమస్య ఎంత తీవ్రంగా మారబోతోంది? మనం చేస్తున్న చిన్న తప్పులు మన వినికిడి శక్తిని ఎలా హరిస్తున్నాయో తెలుసుకుందాం..

పొంచి ఉన్న ముప్పు..

ఐక్యరాజ్యసమితి అంచనా ప్రకారం 12 నుండి 35 ఏళ్ల మధ్య వయసున్న సుమారు ఒక బిలియన్ మంది యువత ప్రమాదంలో ఉన్నారు. దీనికి ప్రధాన కారణం స్మార్ట్‌ఫోన్లు, హెడ్‌ఫోన్ల ద్వారా అతి ఎక్కువ శబ్దంతో సంగీతం వినడం. భారీ శబ్దాల మధ్య గంటల తరబడి గడపడం వల్ల చెవిలోని సున్నితమైన నరాలు దెబ్బతింటున్నాయి. దీనివల్ల చిన్న వయసులోనే వినికిడి లోపం బారిన పడుతున్నారు. పిల్లల్లో వచ్చే వినికిడి సమస్యల్లో దాదాపు 60 శాతం కేసులు నివారించదగినవే అని వైద్యులు చెబుతున్నారు. సరైన సమయంలో పిల్లలకు టీకాలు వేయించాలి. గర్భధారణ సమయంలో, ప్రసవం తర్వాత మెరుగైన జాగ్రత్తలు తీసుకోవాలి. చెవిలో వచ్చే చిన్నపాటి ఇన్‌ఫెక్షన్లకు కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే చికిత్స అందించడం ఉత్తమం.

చాలా దేశాల్లో చెవి, ముక్కు, గొంతు నిపుణులు (ENT), ఆడియాలజిస్టుల కొరత తీవ్రంగా ఉంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వినికిడి పరీక్షలు చేసే సౌకర్యాలు లేకపోవడం వల్ల ప్రారంభ దశలో సమస్యను గుర్తించలేకపోతున్నారు. వినికిడి సమస్య అనేది కేవలం మాట వినపడకపోవడమే కాదు, ఇది మనిషిని మానసిక ఆందోళనకు గురిచేస్తుంది. సామాజికంగా ఒంటరితనం, ఉద్యోగాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. వినికిడి సేవల్లో ప్రభుత్వం పెట్టే ప్రతి ఒక డాలర్ పెట్టుబడికి 16 డాలర్ల సామాజిక మరియు ఆర్థిక లాభం లభిస్తుందని WHO అంచనా వేసింది.

ఆధునిక సాంకేతికత అందుబాటులోకి రావడంతో హియరింగ్ ఎయిడ్‌లు, కాక్‌లియర్ ఇంప్లాంట్లు, స్పీచ్ థెరపీ వంటి పరిష్కారాలు ఇప్పుడు సులభంగా దొరుకుతున్నాయి. తక్కువ వనరులు ఉన్న ప్రాంతాల్లో కూడా ప్రాథమిక పరీక్షలు నిర్వహించడం ద్వారా ఈ భారాన్ని తగ్గించవచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక ప్రకారం, 2050 నాటికి ప్రతి నలుగురిలో ఒకరికి వినికిడి సమస్య వచ్చే అవకాశం ఉంది. శబ్ద కాలుష్యం పెరగడం, జీవనశైలి మారడం దీనికి ప్రధాన కారణాలు. ఇప్పుడే మనం మేల్కోకపోతే భవిష్యత్తు తరం నిశ్శబ్దంగా ఉండిపోవాల్సి వస్తుంది.

చేయాల్సిన పనులు..

  • హెడ్‌ఫోన్ల వాడకాన్ని తగ్గించడం లేదా తక్కువ శబ్దంతో వినడం.
  • భారీ శబ్దాలు వచ్చే ప్రాంతాల్లో ఇయర్ ప్లగ్స్ ధరించడం.
  • క్రమం తప్పకుండా చెవి పరీక్షలు చేయించుకోవడం.
  • పరిసరాల్లో శబ్ద కాలుష్యాన్ని తగ్గించడం.

వినికిడి అనేది ప్రకృతి మనకు ఇచ్చిన గొప్ప వరం. దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉంది. చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం వల్ల ఈ పెనుముప్పు నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చు.

Follow Us