
రాగి అంబలి తీసుకుంటే.. ఎండలతో వచ్చే సమస్యలను దూరం చేస్తుంది. ఇందులో ఐరన్, ఫైబర్, ఖనిజాలు, అయోడిన్ పుష్కలంగా ఉంటాయి. పిల్లలకు కూడా ఆరోగ్యానికి మంచిది. రాగి అంబలితో శరీరానికి చాలా బలం. శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. శరీరంలో అధిక వేడిని తగ్గిస్తుంది. ఉదయం పూట రాగి అంబలి ఒక్క గ్లాస్ తాగినా.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
రాగి అంబలిని ఈరోజు ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ముందురోజు రాత్రే రాగిపిండిని ముద్దలుగా చేసుకొని నానబెట్టుకోవాలి.
రాగిపిండి చక్కగా ఉడికిందో లేదో తెలుసుకోవడానికి మన అమ్మమ్మలు ఏం చేసేవారంటే, తడి చేతితో చిన్న రాగిముద్దను చేతిలోకి తీసుకునేవారు. అప్పుడు రాగిపిండి చేతికి అంటనట్లయితే అది పర్ఫెక్ట్గా ఉడికిందని తెలుసుకునేవారు.
రాగిపిండిని మట్టిపాత్రల్లో రాత్రంతా ఊరనివ్వడం ద్వారా అంబలి చల్లగా, రుచికరంగా ఉండి వేసవిలో తాగేకొద్దీ తాగాలనిపిస్తుంది. అదే, రాగి ముద్దలను స్టీలు గిన్నెల్లో నానబెడితే పిండి కాస్త పులుపెక్కే ఛాన్స్ ఉంటుంది.
రాగి పిండి – ఒక కప్పు
పెరుగు – ఒక కప్పు
ఉప్పు – రుచికి సరిపడా
సన్నని కొత్తిమీర తరుగు – 2 టేబుల్స్పూన్లు
సన్నని కరివేపాకు తరుగు – కొద్దిగా
ఉల్లిపాయ తరుగు – పిడికెడు
అల్లం తరుగు – కొద్దిగా
పచ్చిమిర్చి సన్నని తరుగు – 1 టేబుల్స్పూన్
ముందుగా ఒక బౌల్లో రాగి పిండిని తీసుకొని నాలుగు కప్పుల వరకు వాటర్ పోసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి.
స్టౌ మీద ఆ బౌల్ని ఉంచి పాత్రను రాగి పిండి వదిలేసే వరకు కలుపుతూ ఉడికించుకోవాలి.
రాగి పిండి చిక్కగా మారగానే ఉడికినట్టు కాదు. ఇలా తాగడం వల్లనే కడుపులో మంట, పుల్లటి తేన్పులు రావడం, అరగనట్టు అనిపించడం జరుగుతుందట.
కాబట్టి, నిదానంగా మధ్యమధ్యలో కలుపుతూ రాగి పిండి 15 నుంచి 18 నిమిషాలు ఉడికించుకోవాలి.
రాగిపిండి చక్కగా ఉడికి, కలిపితే గరిటెకు అంటుకోకుండా జారిపోతుందో అప్పుడు గిన్నెను దింపి చల్లారనివ్వాలి.
ఇప్పుడు ఒక మట్టిపాత్రలో ముప్పావు భాగం వరకు(ఒకటిం పావు లీటర్) వాటర్ తీసుకోవాలి.
ఆ తర్వాత చల్లారిన రాగి పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని, మట్టిపాత్రలో తీసుకున్న వాటర్లో వేసుకోవాలి. ఆపై మూతపెట్టి రాత్రంతా ఊరనివ్వాలి.
ఇలా ఊరనివ్వడం ద్వారా శరీరానికి, పొట్టకు మేలు చేసే మంచి బ్యాక్టీరియా ఉత్పత్తి అవుతుంది.
నెక్ట్స్ డే నానబెట్టుకున్న ఆ ముద్దలను చేతితో ఎక్కడా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి.
ఇప్పుడు ఒక గిన్నెలో పెరుగు తీసుకొని తరకలు లేకుండా విస్కర్ సహాయంతో బాగా చిలుక్కోవాలి.
ముందుగా ప్రిపేర్ చేసుకున్న జావలో వేసుకొని కలుపుకోవాలి. ఆపై ఉప్పు వేసుకొని రెండు మూడుసార్లు బాగా చిలుక్కోవాలి.
ఇక చివర్లో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కొత్తిమీర, అల్లం, పచ్చిమిర్చి తరుగు వేసుకొని అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత గ్లాసులలో పోసుకొని సర్వ్ చేసుకోవాలి.